పరీక్షలో మొబైల్ ఫోన్తో పట్టుబడి.. ఐఐటీ బాంబే విద్యార్థి సూసైడ్.. పలువురిపై కేసు
ABN , Publish Date - Sep 20 , 2026 | 06:33 AM
పరీక్షలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ పట్టుబడిన ఐఐటీ బాంబే క్యాంపస్ విద్యార్థి సాహిల్ రవీంద్ర(22) శుక్రవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ముంబై, సెప్టెంబరు 19: పరీక్షలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ పట్టుబడిన ఐఐటీ బాంబే క్యాంపస్ విద్యార్థి సాహిల్ రవీంద్ర(22) శుక్రవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాకు చెందిన వాడని పోలీసులు చెప్పారు. అయితే తన కుమారుడిని వేధించి హత్య చేశారని అతడి తల్లి ఆరోపించింది. రవీంద్రను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రవీంద్ర ఎనర్జీ సైన్స్, ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి. ఐఐటీ బాంబే విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పరీక్ష జరుగుతుండగా రవీంద్ర ప్రశ్నపత్రాన్ని జవాబుల కోసం చాట్ జీపీటీకి అప్లోడ్ చేస్తూ పట్టుబడ్డాడు. తర్వాత హాస్టల్ రూమ్కి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫోన్తో పట్టుబడినా రవీంద్రపై ఎటువంటి క్రమశిక్షణ చర్య తీసుకోలేదని ఐఐటీ బాంబే పేర్కొంది. కాగా, ఐఐటీ బాంబేలో గత ఏడు నెలల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.