మహారాష్ట్ర పర్భానీలో కూలిన నిర్మాణంలో ఉన్న హనుమాన్ ఆలయ మండపం..
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:19 PM
మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. మానవత్ తాలూకా యశ్వాడిలో నిర్మాణంలో ఉన్న త్రిమూర్తి హనుమాన్ దేవాలయ మండపం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
పర్భానీ (మహారాష్ట్ర), జూన్ 20: మహారాష్ట్రలోని పర్భానీ జిల్లా యశ్వాడి గ్రామంలో ఇవాళ (శనివారం) ఘోర ప్రమాదం సంభవించింది. ఇక్కడి ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో నిర్మాణంలో ఉన్న మండపం పైకప్పు భాగం ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు చనిపోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.
హనుమాన్ దేవాలయాల్లో శనివారం నాడు భక్తుల రద్దీ సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. యశ్వాడి గ్రామంలోని ఈ ఆలయానికి కూడా ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులంతా దర్శనం కోసం వేచి ఉన్న సమయంలో, గత కొన్ని రోజులుగా నిర్మాణంలో ఉన్న మండపం పైకప్పు, దానికి ఆసరాగా ఉన్న ఒక పిల్లర్, గోవా కర్రలు ఒక్కసారిగా కుప్పకూలి కింద ఉన్న భక్తులపై పడ్డాయి. ఈ హఠాత్పరిణామంతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం, భయాందోళనలు రేగాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో దాదాపు 20 మంది భక్తులకు తీవ్ర గాయాలయినట్టు సమాచారం. వెంటనే స్పందించిన స్థానికులు, ఆలయ సిబ్బంది గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సభామండపం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న మండపం కూలిపోవడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్ వన్డే సిరీస్కు హార్దిక్ పాండ్య దూరం!
ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు