Share News

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌..ఏడుగురు మావోయిస్టులు మృతి

ABN , Publish Date - Feb 07 , 2026 | 03:51 AM

ఛత్తీస్‌గఢ్ -మహారాష్ట్ర సరిహద్దుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గడ్చిరోలి డివిజన్‌ కమిటీ కార్యదర్శి, తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన లోకేటి చందర్‌రావు అలియాస్‌ సహా ఏడుగురు మావోయిస్టులు, ఒక జవాను మృతి చెందారు. మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. పె

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌..ఏడుగురు మావోయిస్టులు మృతి

  • మృతుల్లో గడ్చిరోలి డివిజన్‌ కమిటీ కార్యదర్శి,కామరెడ్డి జిల్లాకు చెందిన లోకేటి చందర్‌రావు

గడ్చిరోలి/భువనేశ్వర్‌/కామారెడ్డి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ -మహారాష్ట్ర సరిహద్దుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గడ్చిరోలి డివిజన్‌ కమిటీ కార్యదర్శి, తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన లోకేటి చందర్‌రావు అలియాస్‌ సహా ఏడుగురు మావోయిస్టులు, ఒక జవాను మృతి చెందారు. మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు గడ్చిరోలి అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు మూడు రోజులుగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఎన్‌కౌంటర్‌ జరిగింది. గురువారం రాత్రి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించగా, శుక్రవారం ఉదయం మరో నలుగురి మృతదేహాలు లభ్యమైనట్టు గడ్చిరోలి పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో దీపక్‌ చిన్నా మడావి, జోగా మడావి అనే ఇద్దరు జవాన్లకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. వారిని హెలికాప్టర్‌లో భమ్రాగడ్‌లోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో దీపక్‌ చనిపోయారు. ఘటనా స్థలంలో మూడు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా, ఒడిశా మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు నిరంజన్‌ రౌత్‌ అలియాస్‌ నిఖిల్‌, ఆయన భార్య రష్మీరా లెంక అలియాస్‌ ఇందుతోపాటు 19 మంది మావోయిస్టులు శుక్రవారం ఆ రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిరంజన్‌రౌత్‌, రష్మీరా దంపతులపై రూ.55లక్షల చొప్పున రివార్డు ఉంది.

మూడున్నర దశాబ్దాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లి..

గడ్చిరోలి డివిజన్‌ కమిటీ కార్యదర్శి, పశ్చిమ సబ్‌జోనల్‌ బ్యూరో సభ్యుడు లోకేటి చందర్‌రావు(61) స్వస్థలం తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామం. మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిన ఆయన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా దళ కమాండర్‌గా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత దండకారణ్యానికి వెళ్లారు. చందర్‌ భార్య సులోచన కూడా భర్తతో కలిసి అడవి బాట పట్టారు. వారి కుమారుడు రమేశ్‌, కూతురు లావణ్య కూడా 2009లో మావోయిస్టు పార్టీలో చేరారు. సులోచన 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో దండకారణ్యంలో మరణించారు. కుమారుడు రమేశ్‌ ఇటీవల లొంగిపోగా, కుమార్తె లావణ్య ఛత్తీ్‌సగఢ్‌లో అరెస్టయ్యారు.

Updated Date - Feb 07 , 2026 | 03:54 AM