ఐటీ జాబ్ వదిలి ఆటోడ్రైవర్గా..!
ABN , Publish Date - May 31 , 2026 | 05:02 AM
ఓ మహిళ నడుపుతోన్న ఆటోలో ప్రయాణించిన మహిళా ఆంత్రప్రెన్యూర్ ఆమెతో యథాలాపంగా జరిపిన సంభాషణ ఒక ఆసక్తికర అంశాన్ని వెలుగులోకి తెచ్చింది
9 ఏళ్లు ఐటీ మేనేజర్గా పనిచేసి..వృత్తి మార్చుకున్న మహిళ
బెంగళూరు, మే 30: ఓ మహిళ నడుపుతోన్న ఆటోలో ప్రయాణించిన మహిళా ఆంత్రప్రెన్యూర్ ఆమెతో యథాలాపంగా జరిపిన సంభాషణ ఒక ఆసక్తికర అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ నజ్రీన్ మిధ్లాజ్ అనే ఆంత్రప్రెనూయర్ షేర్ చేయగా ఆ వీడియో వైరల్ అవుతోంది. ఎక్కువగా మగవాళ్లే నడిపే ఆటోను ఆ మహిళ అలవోకగా నడిపేస్తూ ఆత్మవిశ్వాసంతో కనిపించడం మిధ్లాజ్ను ఆశ్చర్యపరిచింది. దీంతో ఆ మహిళా ఆటోడ్రైవర్తో ఆమె మాటలు కలిపారు. కేవలం మగవాళ్లు మాత్రమే కనిపించే ఆ వృత్తిలో ఆమె ఎలా కొనసాగుతోందని ప్రశ్నించగా.. ఆమె తాను ఈ వృత్తిలో ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పింది. తాను ఐటీ మేనేజర్గా 9 ఏళ్లు పనిచేశానని, ఏటా లక్షలు సంపాదించినా ఆ వృత్తిలో ఎదుర్కొన్న ఒత్తిడి, మానసిక ఆందోళన, నిరంతర టెన్షన్ తనను దాన్ని వదిలేలా చేశాయని ఆ మహిళా ఆటోడ్రైవర్ చెప్పారు. ఆటోడ్రైవర్గా నెలకు రూ.60,000 సంపాదిస్తున్నట్లు ఆమె చెప్పారని మిధ్లాజ్ తన పోస్ట్లో వివరించారు. అయితే ఈ వృత్తిలో తాను ఎంతో ఆనందంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారని తెలిపారు. ఆమెతో జరిపిన సంభాషణ తనపై ఎంతో ప్రభావం చూపిందని మిధ్లాజ్ పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆ మహిళ(ఆటోడ్రైవర్) నిర్ణయాన్ని ప్రశంసించారు.