బంగారు ఆభరణాలు తెచ్చే వారికి ఊరట
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:15 AM
విదేశాల నుంచి బంగారు ఆభరణాలను తీసుకురావాలనుకునే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను కల్పించింది.
విదేశాల నుంచి మహిళలు 40, పురుషులు 20 గ్రాముల పసిడి ఆభరణాలు తేవొచ్చు
‘విలువ’ పరిమితి ఎత్తివేత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: విదేశాల నుంచి బంగారు ఆభరణాలను తీసుకురావాలనుకునే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను కల్పించింది. ఈమేరకు ఈ నెల 2వ తేదీ నుంచి బ్యాగేజీ నిబంధనలు, 2026ను అమల్లోకి తెచ్చారు. కొత్త బ్యాగేజీ నిబంధనల మేరకు ఆభరణాలపై ఉన్న గరిష్ఠ పరిమితిని యథాతథంగా కొనసాగిస్తూ.. ‘విలువ’ పరిమితిని తొలగించింది. ఈమేరకు ఏడాదికి మించి విదేశాల్లో నివసిస్తూ తిరిగి వస్తున్న భారతీయ నివాసితులు లేదా భారత సంతతికి చెందిన పర్యాటకుల్లో మహిళలు అయితే 40 గ్రాముల వరకు, పురుషులు అయితే 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను ఎలాంటి సుంకాలు లేకుండా తీసుకురావొచ్చు. అయితే ఆభరణాలను కచ్చితంగా వ్యక్తిగత వినియోగం కోసమే తీసుకురావాలి. అమ్మకానికి ఉద్దేశించి కాకూడదు. 15 ఏళ్లకన్నా తక్కువ వయసున్న పిల్లలు కూడా 40 గ్రాముల బంగారు ఆభరణాలను కస్టమ్స్ సుంకం లేకుండా తెచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు భారతీయులు 20 గ్రాముల వరకు బంగారాన్ని (గరిష్ఠ విలువ రూ.50,000 వరకు) సుంకం లేకుండా తెచ్చేందుకు అనుమతించారు. మహిళలు, పిల్లలు 40 గ్రాముల వరకు బంగారం (రూ.లక్ష వరకు) తెచ్చేందుకు సుంకం ఉండేది కాదు. ఇప్పుడు మహిళలు 40 గ్రాములు, ఇతరులకు సంబంధించి 20 గ్రాముల గరిష్ఠ పరిమితిని యథాతథంగానే ఉంచి.. విలువకు సంబంధించిన పరిమితిని తొలగించారు. కొత్త రూల్స్ ప్రకారం.. 18 ఏళ్లు దాటిన ప్రయాణికులు కొత్త లాప్టా్పను లేదా నోట్ప్యాడ్ను సుంకం లేకుండా తేవొచ్చు.