వాణిజ్య ఒప్పందంపై 23 నుంచి తుది చర్చలు
ABN , Publish Date - Feb 21 , 2026 | 02:12 AM
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా డాక్యుమెంట్ల రూపకల్పనపై చర్చల కోసం ఇరు దేశాల వాణిజ్య ప్రతినిధులు ...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా డాక్యుమెంట్ల రూపకల్పనపై చర్చల కోసం ఇరు దేశాల వాణిజ్య ప్రతినిధులు సోమవారం(ఈ నెల 23) నుంచి మూడు రోజుల పాటు సమావేశం కానున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఇందులో భారత బృందానికి దర్పన్ జైన్ నేతృత్వం వహిస్తారని చెప్పారు. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో ఇది తుది అంశమన్నారు. మార్చిలో ఈ వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేసే అవకాశం ఉందని వివరించారు. భారత్-అమెరికా ఇటీవల మధ్యంతర వాణిజ్య ఒప్పందం వివరాలను సంయుక్త ప్రకటన ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, అమెరికా విదేశాంగ మంత్రి రుబియో వచ్చే రెండుమూడు నెలల్లో భారత్లో పర్యటించే అవకాశం ఉందని ఆ దేశ రాయబారి సెర్జియో గోర్ చెప్పారు.