ఈపీఎఫ్వో పెన్షన్ను వెంటనే పెంచాలి
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:01 AM
ఉద్యోగుల పెన్షన్ పథకం-1995 ప్రకారం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న కనీస పెన్షన్ను వెంటనే సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ స్థాయీ సంఘం మంగళవారం సూచించింది.
కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు
న్యూఢిల్లీ, మార్చి17: ఉద్యోగుల పెన్షన్ పథకం-1995 ప్రకారం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న కనీస పెన్షన్ను వెంటనే సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ స్థాయీ సంఘం మంగళవారం సూచించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో సభ్యులైన ఉద్యోగులకు ఎంతోకాలంగా కనీస పెన్షన్ నెలకు రూ.1,000 మాత్రమే ఇస్తున్నారని.. ప్రస్తుత అవసరాలకు ఇది ఏమాత్రం సరిపోదని తెలిపింది. వృద్ధాప్యంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ వాస్తవికంగా ఉండాలని అభిప్రాయపడింది. లేబర్, టెక్స్టైల్స్, స్కిల్ డెవల్పమెంట్పై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర కార్మిక , ఉపాధి కల్పన శాఖకు సమర్పించిన తన 15వ నివేదికలో ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. కనీస పెన్షన్ను నెలకు రూ.7,500లకు పెంచాలని పెన్షనర్లు ఈ నెల 9 నుంచి ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మూడు రోజులపాటు ధర్నా నిర్వహించిన నేపథ్యంలో ఈ సిఫారసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, సాధారణ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ప్రమాద బీమా సొమ్మును వెంటనే చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కూడా పార్లమెంటరీ కమిటీ సూచించింది.