డీఆర్ కాంగోలో ఎబోలా వ్యాప్తి.. 87మంది మృతి
ABN , Publish Date - May 18 , 2026 | 02:31 AM
ఆఫ్రికా ఖండ దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్ కాంగో)లో ఎబోలా వైరస్ కారణంగా ఇటీవలి కాలంలో 87మంది చనిపోయారు....
న్యూఢిల్లీ, మే 17: ఆఫ్రికా ఖండ దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్ కాంగో)లో ఎబోలా వైరస్ కారణంగా ఇటీవలి కాలంలో 87మంది చనిపోయారు. ఇంకా దాదాపు మూడు వందల మందికి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆ దేశంలో ప్రజల ఆరోగ్యం పరంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయంగా కూడా ఆందోళనపరిచే అంశంగా పేర్కొంది. డీఆర్ కాంగో పొరుగు దేశం ఉగాండాలో కూడా ఇద్దరికి ఎబోలా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇందులో ఒకరు చనిపోయారు. ఈ నేపథ్యంలో, డీఆర్ కాంగో, దాని పొరుగున ఉన్న దేశాలకు ప్రయాణాలు చేయవద్దని డబ్ల్యూహెచ్వో సూచించింది. అయితే, ఇది కొవిడ్లాగా మహమ్మారిలాగా మారే అవకాశాలు తక్కువేనని పేర్కొంది. ఎబోలా వైర్సను మొట్టమొదట 1976లో డీఆర్ కాంగోలోనే గుర్తించారు. అప్పటి నుంచి ఈ వైరస్ 17సార్లు ఆందోళనకర స్థాయిలో ప్రజల్లో వ్యాపించింది.