శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణులకు..5 వేల కి.మీ. దూరంలోనే చెక్
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:50 AM
శత్రుదేశాలు ప్రయోగించిన బాలిస్టిక్ ఖండాంతర క్షిపణులను 5వేల కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకొని ధ్వంసం చేసే ‘బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్...
బీఎండీ ఫేజ్-2 వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో
అల్వాల్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): శత్రుదేశాలు ప్రయోగించిన బాలిస్టిక్ ఖండాంతర క్షిపణులను 5వేల కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకొని ధ్వంసం చేసే ‘బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ) ఫేజ్-2’ వ్యవస్థను మన డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. డీఆర్డీవో పరీక్షించినవాటిలో రెండు తదుపరి తరం ఇంటర్సెప్టర్ క్షిపణులు ఉండగా.. మరొకటి నేవల్ యాంటీ షిప్ క్షిపణి. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జూన్ 10, 11 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ వ్యవస్థ శత్రు క్షిపణులను అంతరిక్షంలో లేదా వాతావరణ పరిధిలో ముందే గుర్తించి వాటిని తుత్తునియలు చేస్తుంది. ఇంతటి అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థ అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్ వద్ద మాత్రమే ఉంది. ఈ పరీక్షల ద్వారా.. అత్యున్నత స్థాయి రక్షణ వ్యవస్థ గల ఆ దేశాల సరసన భారత్ చేరినట్టయిందని రక్షణ శాఖ తెలిపింది. అలాగే.. నేవల్ యాంటీషిప్ మిసైల్ మీడియం రేంజ్ తొలి ఫ్లైట్ టెస్ట్ను కూడా డీఆర్డఈవో విజయవంతంగా నిర్వహించింది. మీడియం రేంజ్లోని శత్రువుల యుద్ధనౌకలే లక్ష్యంగా కచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీవో శాస్త్రజ్ఞులను అభినందించారు. ‘‘లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణుల నుంచి బహుళ అంచెల రక్షణను, అలాగే మీడియం రేంజ్లో శత్రు నౌకలను అడ్డుకునే సత్తా మనకుందని నిరూపించే 3 పరీక్షలను వరుసగా నిర్వహించాం’’ అని అన్నారు.