రాజ్యసభలో నాటకీయ దృశ్యం
ABN , Publish Date - Feb 03 , 2026 | 02:34 AM
రాజ్యసభలో సోమవారం నాటకీయ దృశ్యం చోటు చేసుకుంది. కేరళ నుంచి నామినేటెడ్ సభ్యుడిగా నిమితులైన బీజేపీ సభ్యుడు సి.సదానందన్ మాస్టార్ తన కృత్రిమ కాళ్లను డెస్కుపై పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
కృత్రిమ కాళ్లను డెస్క్పై పెట్టిన నామినేటెడ్ సభ్యుడు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: రాజ్యసభలో సోమవారం నాటకీయ దృశ్యం చోటు చేసుకుంది. కేరళ నుంచి నామినేటెడ్ సభ్యుడిగా నిమితులైన బీజేపీ సభ్యుడు సి.సదానందన్ మాస్టార్ తన కృత్రిమ కాళ్లను డెస్కుపై పెట్టడం చర్చనీయాంశంగా మారింది. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని ఆయన సభలో ప్రప్రథమ ప్రసంగం చేశారు. ‘ప్రజాస్వామ్యం అంటూ ఘర్జనలు చేస్తున్న కొందరు 31 ఏళ్ల క్రితం 1994లో నాపై దాడి చేశారు. ఇంటికి వెళ్తున్నప్పుడు కొందరు క్రిమినల్స్ నా కాళ్లను నరికేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేశారు’ అని చెప్పారు. కృత్రిమ కాళ్లను డెస్కుపై పెట్టడంతో తొలి ప్రసంగాన్ని కూర్చొని చేయాల్సి వచ్చిందని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ప్రజల ముందు ఉంచడానికే ఇలా చేసినట్టే తెలిపారు. డెస్కుపై కృత్రిమ కాళ్లు పెట్టడంపై సీపీఎం సభ్యుడు జాన్ బ్రిట్టాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా నిరసన తెలిపాయి. సభలో ఎలాంటి వస్తువులను ప్రదర్శించడాన్ని నిషేధించారని, అలాంటప్పుడు కృత్రిమ కాళ్లను డెస్కుపై పెట్టడానికి ఎలా అనుమతి ఇస్తారని చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ను ఉద్దేశించి బ్రిట్టాస్ ప్రశ్నించారు. ఆయన ఇప్పటికే చాలాసార్లు కృత్రిమ కాళ్లతో సభకు వచ్చారని, ఇప్పుడు డెస్కుపై పెట్టడం ఏమిటని అడిగారు. దాంతో ఆ సభ్యుడు వాటిని తీసివేశారు.