ఎక్కడికీ వెళ్లేది లేదు..!
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:18 AM
ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి తప్పుకొనేది లేదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంతశర్మ పరోక్షంగా ప్రకటించారు. తాను ఎక్కడికీ వెళ్లేది లేదని..
ఢిల్లీ మద్యం కేసులో నా విధిని నిర్వర్తిస్తా
కేజ్రీవాల్తో పాటు ఇతరుల రెక్యూసల్ పిటిషన్లను కొట్టివేసిన జస్టిస్ స్వర్ణకాంత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి తప్పుకొనేది లేదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంతశర్మ పరోక్షంగా ప్రకటించారు. తాను ఎక్కడికీ వెళ్లేది లేదని.. తన విధిని తాను పూర్తి చేస్తానన్నారు. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణకాంతశర్మ తప్పుకోవాలంటూ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్తో పాటు ఇతర నిందితులు దాఖలు చేసిన (రెక్యూసల్) పిటిషన్లను ఆమె కొట్టివేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా న్యాయమూర్తిపై ఓ లిటిగెంట్ ఆరోపణలు చేయడాన్ని అనుమతించలేమన్నారు. పక్షపాతంగా వ్యవహరిస్తారనే నిరాధార అనుమానాన్ని సంతృప్తిపర్చడానికి న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకోలేరన్నారు. ఈ కేసు సాక్ష్యాలతో కాకుండా కేవలం సందేహాలు, ఊహాగానాలతో ముందుకొచ్చిందన్నారు. ‘ఎటువంటి ఆధారాల్లేకుండా ఓ రాజకీయ నాయకుడు ఓ వ్యవస్థకు నష్టం కలిగించడానికి అనుమతించలేం. ఓ న్యాయమూర్తిపై వ్యక్తిగత దాడి అంటే అది న్యాయవ్యవస్థపైనే దాడి.. ఈ కోర్టు తన కోసం.. ఈ వ్యవస్థ కోసం నిలబడుతుంది.. ఎక్కడికీ వెళ్లేది లేదు. నా విధిని నేను పూర్తిచేశాకే వెళ్తా..’ అని అన్నారు.