జీవిత భాగస్వామి ఆదాయ వివరాలు ఆర్టీఐ కింద పొందలేరు: ఢిల్లీ హైకోర్టు
ABN , Publish Date - May 04 , 2026 | 03:43 AM
సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి తన జీవిత భాగస్వామికి సంబంధించిన ఆదాయ వివరాలు పొందలేరని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, మే 3: సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి తన జీవిత భాగస్వామికి సంబంధించిన ఆదాయ వివరాలు పొందలేరని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సమాజానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం ఆర్టీఐ చట్టం ఉద్దేశం కాదని,. బలమైన ప్రజాప్రయోజనం ఉంటే తప్ప ఒక వ్యక్తికి సంబంధించిన ఆదాయ పన్ను వివరాలు ఇతరులకు అందించకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ వివరాలను థర్డ్ పార్టీకి (జీవిత భాగస్వామితో సహా) వెల్లడించడం వారి వ్యక్తిగత గోప్యతా హక్కును ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. విడాకుల కేసులో భర్త నుంచి భరణం పొందేందుకు.. అతడి ఆదాయ పన్ను వివరాలు అవసరమంటూ ఓ మహిళ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకోగా, ఆ వివరాలను బహిర్గతం చేయాలని ఐటీ అధికారులను సీఈసీ (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్) ఆదేశించింది. అయితే, సీఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత కోసం ఆర్టీఐని వినియోగించాలి తప్ప.. భార్యాభర్తల మధ్య ఉండే వ్యక్తిగత వివాదాల్లో ఇది వర్తించదని పేర్కొంది.