Congress Launches: 10 నుంచి ఉపాధి హామీ బచావో సంగ్రామ్
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:22 AM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను పునరుద్ధరించాలని, దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీ జీరామ్జీ చట్టాన్ని ....
న్యూఢిల్లీ, జనవరి 3: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను పునరుద్ధరించాలని, దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీ జీరామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ 45 రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించనుంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ బచావో సంగ్రామ్ పేరిట ఈనెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు ఈ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్ శనివారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 10న జిల్లా స్థాయిలో విలేకరుల సమావేశాలు నిర్వహించి, రోజంతా నిరాహారదీక్షలు చేస్తామని, 11న జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. 12 నుంచి 29 వరకు అన్ని గ్రామాల్లో పంచాయతీ స్థాయి సమావేశాలు, ఇంటింటికీ తిరిగి చైతన్యం కలిగించే కార్యక్ర మాలు నిర్వహిస్తామని తెలిపారు. 30న వార్డు స్థాయిలో శాంతియుత ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 7 నుంచి 15వ తేదీ వరకు విధాన సభల వద్ద రాష్ట్రస్థాయి ఘెరావ్లు, ఫిబ్రవరి 16 నుంచి 25 వరకు నాలుగు ప్రధాన ర్యాలీలు నిర్వహించనున్నట్టు తెలిపారు.