కాంగ్రెస్ లో ‘బ్రిక్స్’ రగడ
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:55 AM
బ్రిక్స్ సదస్సు సాక్షిగా కాంగ్రెస్ శిబిరంలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బ్రిక్స్ సదస్సు వల్ల దేశానికి ఒరిగేదేమీ లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ తప్పుబట్టారు.
సదస్సుపై చిదంబరం విమర్శలకు శశి థరూర్ కౌంటర్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: బ్రిక్స్ సదస్సు సాక్షిగా కాంగ్రెస్ శిబిరంలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బ్రిక్స్ సదస్సు వల్ల దేశానికి ఒరిగేదేమీ లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ తప్పుబట్టారు. గ్లోబల్ సౌత్లోని 100 దేశాల్లో అతి కీలకమైన 11 దేశాలు పాల్గొంటున్న సదస్సుకు భారత్ నేతృత్వం వహించడం చిన్న విషయం కాదని థరూర్ అన్నారు. భిన్న ఆలోచనలు, ధోరణులు, దృక్పథాలు కలిగిన ఇన్ని దేశాలతో భారత్ జరిపే సమావేశాలకు, కుదుర్చుకునే ఒప్పందాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇది దేశ దౌత్య శక్తికి అద్దం పడే విషయం అని తెలిపారు. చిదంబరానికి థరూర్ కౌంటరుపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ గుట్టును ఆ పార్టీవారే బయటపెట్టారని బీజేపీ జాతీయ మీడియా కో-ఇన్చార్జీ ప్రతీప్ భండారీ వ్యాఖ్యానించారు. చిదంబరాన్ని ‘కోపంతో ఉన్న మేనమామ’గా భండారీ ఎద్దేవా చేశారు. రాహుల్గాంధీ ఆదేశాలతో బ్రిక్స్ సదస్సును వ్యతిరేకిస్తున్న ఆయన అసలు రంగును థరూర్ బయటపెట్టారన్నారు.