కారుణ్య నియామకాలు హక్కు కాదు: సీఐసీ
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:27 AM
కారుణ్య నియామకాలకు సంబంధించి కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కారుణ్య నియామకాలు హక్కు కాదు’’ అని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కారుణ్య నియామకాలకు సంబంధించి కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కారుణ్య నియామకాలు హక్కు కాదు’’ అని స్పష్టం చేసింది. మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అందించే తోడ్పాటు మాత్రమేనని, దరఖాస్తుదారులు తమ హక్కుగా కారుణ్య నియామకాన్ని కోరలేరని పేర్కొంది. కారుణ్య నియామకాల్లో పారదర్శకత లేకపోవడం వల్ల ఈ వ్యవహారానికి సంబంధించి సమాచార చట్టం(ఆర్టీఐ) కింద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. లఖ్నవూలోని సెంట్రల్ జీఎస్టీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విభాగాల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి వచ్చిన ఆర్టీఐ దరఖాస్తులపై కమిషన్ ఈ మేరకు స్పందించింది. ఈ రెండు విభాగాల్లో కారుణ్య నియామకాల కోసం డిపార్ట్మెంటల్ స్ర్కీనింగ్ కమిటీలు పరిశీలించిన రికార్డులను, దరఖాస్తుదారుల అర్హతలు, మెరిట్ వివరాలను మూడు వారాల్లోగా బహిర్గతం చేయాలని ఆదేశించింది.