LPG Cylinder Price Hiked: 19 కిలోల సిలిండర్పై రూ.111 పెంపు
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:13 AM
హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపార సంస్థలు వినియోగించే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను ప్రభుత్వరంగ చమురు సంస్థలు రూ.111 మేర పెంచాయి.
న్యూఢిల్లీ, జనవరి 1: హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపార సంస్థలు వినియోగించే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను ప్రభుత్వరంగ చమురు సంస్థలు రూ.111 మేర పెంచాయి. ఇది గురువారం నుంచే అమల్లోకి వచ్చింది. తాజా పెంపు తర్వాత ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.1,691.50కు, హైదరాబాద్లో రూ.1,912కు పెరిగింది. ఇక గృహ అవసరాల కోసం వినియోగించే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను మాత్రం కంపెనీలు యథాతథంగా ఉంచాయి. కాగా ఏటీఎఫ్ ధరను గురువారం 7.3 శాతం తగ్గించాయి. దీంతో ఢిల్లీలో కిలో లీటరు ఏటీఎఫ్ ధర రూ.7,353.75 తగ్గి రూ.92,323.02కు చేరుకుంది. ఏటీఎఫ్ ధర తగ్గిన నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు కూడా దిగిరావడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు, మారకం రేటును బట్టి చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలను సవరిస్తున్న విషయం తెలిసిందే.