భారీగా పెరిగిన సిగరెట్ల ధర
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:50 AM
బడ్జెట్లో అదనంగా ఎక్సైజ్ సుంకం విధించడంతో సిగరెట్ల ధరలు ఆదివారం నుంచే భారీగా పెరిగాయి. 10 సిగరెట్లు ఉండే ఒక్కో ప్యాకెట్పై కనిష్ఠంగా రూ.22 నుంచి గరిష్ఠంగా రూ.55 వరకు పెరుగుదల అమల్లోకి వచ్చింది.
ఒక్కో ప్యాకెట్పై రూ.55 వరకు బాదుడు
బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అమల్లోకి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: బడ్జెట్లో అదనంగా ఎక్సైజ్ సుంకం విధించడంతో సిగరెట్ల ధరలు ఆదివారం నుంచే భారీగా పెరిగాయి. 10 సిగరెట్లు ఉండే ఒక్కో ప్యాకెట్పై కనిష్ఠంగా రూ.22 నుంచి గరిష్ఠంగా రూ.55 వరకు పెరుగుదల అమల్లోకి వచ్చింది. డిస్ర్టిబ్యూటర్లు తెలిపిన వివరాల మేరకు 76 మిల్లీమీటర్ల పొడవు ఉండే ప్రీమియం సిగరెట్లకు బ్రాండ్ను బట్టి ఒక్కో ప్యాకెట్పై రూ.50 నుంచి రూ.55 వరకు ధర పెరిగింది. సిగరెట్ల తయారీదారులు గరిష్ఠ అమ్మకం ధర(ఎంఆర్పీ)ను ఇంకా సవరించనప్పటికీ, డిస్ర్టిబ్యూటర్లు పాత స్టాక్కు 40 శాతం జీఎస్టీతో రిటైలర్లకు బిల్లులు ఇవ్వడం ప్రారంభించేశారు. ఆదివారం హోల్సేల్ మార్కెట్లు మూసి ఉన్నందున, సోమవారం నుంచి హోల్సేల్ వ్యాపారులూ ఎంఆర్పీని సవరించే అవకాశం ఉందని డిస్ర్టిబ్యూటర్లు భావిస్తున్నారు. ప్రిన్స్ నావీ కట్ డీలక్స్ ప్యాకెట్ను ఇప్పటి వరకు రూ.95కు విక్రయిస్తుండగా దీని ధర రూ.120 వరకు చేరొచ్చని భావిస్తున్నారు. గోల్డ్ఫ్లాక్ లైట్స్, విల్స్ క్లాసిక్, విల్స్ క్లాసిక్ మైల్డ్స్ తదితర ప్యాకెట్ల ధర రూ.170 ఉండగా, వాటి ధర రూ.220 నుంచి రూ.225 వరకు పెరగొచ్చని అంటున్నారు. ఇక తయారీదారులు ఈ నెలాఖరు నుంచి కొత్త ఎంఆర్పీని అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే స్టాక్ను నిలిపేశాయని, కొత్త ధరలు ముద్రించాక ఆ స్టాక్ను విడుదల చేసే అవకాశం ఉందని ఒక స్టాకిస్ట్ తెలిపారు.