ఎవరు రాజీనామా చేస్తే నాకేంటి!
ABN , Publish Date - Aug 30 , 2026 | 06:09 AM
ఒకే వివాదంలో మంత్రి నాగేంద్ర రెండోసారి తన పదవికి రాజీనామా చేయడంపై వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ అకౌంట్స్ అధికారి చంద్రశేఖరన్ భార్య కవిత స్పందించారు.
మా కుటుంబానికి న్యాయం చేయండి
వాల్మీకి కార్పొరేషన్ ఉద్యోగి చంద్రశేఖరన్ భార్య కవిత డిమాండ్
బెంగళూరు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఒకే వివాదంలో మంత్రి నాగేంద్ర రెండోసారి తన పదవికి రాజీనామా చేయడంపై వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ అకౌంట్స్ అధికారి చంద్రశేఖరన్ భార్య కవిత స్పందించారు. శివమొగ్గలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎవరు రాజీనామా చేసినా తమ కుటుంబానికి ఒరిగేది ఏమీ లేదన్నారు. తన భర్త చంద్రశేఖరన్ 2024, మే 26న సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. తన భర్త బలవన్మరణం విషయంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన భర్తను వేధించిన అధికారులు పరశురామ్, పద్మనాభ్పై కనీస చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పేర్లను సూసైడ్ నోట్లో రాశారని, అయినా ఎక్కడ న్యాయం జరిగిందని ప్రశ్నించారు. తన భర్త పీఎఫ్ కూడా తనకు రాలేదని, తన పెద్ద కుమారుడికి ఉద్యోగం ఇస్తామన్న హామీ కూడా నెరవేరలేదని తెలిపారు. సమగ్ర దర్యాప్తు జరిపి, తన భర్త ఆత్మహత్యకు కారణమైనవారికి తగిన శిక్ష పడేలా చూడాలని కవిత డిమాండ్ చేశారు.