ఈశాన్యంలో 2029కల్లా తీవ్రవాదం అంతం
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:46 AM
డెడ్లైన్ పెట్టి మరీ మావోయిస్టులను దాదాపుగా నిర్మూలించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాదంపై దృష్టి సారించింది....
ఈ ఆగస్టు తర్వాత మణిపూర్ నుంచే ఆపరేషన్ మొదలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: డెడ్లైన్ పెట్టి మరీ మావోయిస్టులను దాదాపుగా నిర్మూలించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాదంపై దృష్టి సారించింది. ఈ ఏడాది మార్చి 31 లోపు మావోయిస్టులను ఆపరేషన్ కగార్ ద్వారా అంతం చేస్తామని ప్రకటించి.. ఆ దిశగా ఆపరేషన్లను నిర్వహించినట్టుగానే, ఈశాన్యాన్ని 2029 నాటికి తీవ్రవాద విముక్తి ప్రాంతంగా మార్చాలని కేంద్ర హోంశాఖ సంకల్పించింది. ఇందులోభాగంగా తొలుత మణిపూర్పై దృష్టి సారించారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ను (సీఏపీఎఫ్) ఈ ఆపరేషన్కు వినియోగించనున్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో నిన్నటివరకు ఆపరేషన్లు నిర్వహించిన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, నాగా బెటాలియన్ వంటి కేంద్ర పోలీసు విభాగాలనుంచీ కొన్ని బలగాలను ఈశాన్యానికి పంపించనున్నారు. మణిపూర్తోపాటు అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ల్లో తీవ్రవాద వ్యతిరేక చర్యలను రానున్నకాలంలో పెంచనున్నారు. ఈశాన్య రాష్ట్రాల పరిధిలో 16 తీవ్రవాద సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని అంచనా. ఇందులో ఒక్క మణిపూర్లోనే ఎనిమిది సంస్థలు ఉన్నాయి.