Union Transport Minister Nitin Gadkari: రోడ్డు ప్రమాదాల నివారణకు వీ2వీ సాంకేతిక పరిజ్ఞానం
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:16 AM
రోడ్డు ప్రమాదాల నివారణకు వెహికిల్ టు వెహికిల్ (వీ2వీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
కార్లలో వైర్లెస్ వ్యవస్థ: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ, జనవరి 8: రోడ్డు ప్రమాదాల నివారణకు వెహికిల్ టు వెహికిల్ (వీ2వీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. డ్రైవర్కు రియల్టైంలో సమీపంలోని ఇతర వాహనాలు, స్పీడు, ప్రమాదకర ప్రాంతాలు తదితర వివరాలు పంపించి, తగిన హెచ్చరికలు చేయడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని తెలిపారు. టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయంతో దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. గురువారం ఇక్కడ జరిగిన రాష్ట్రాల రవాణా మంత్రుల వార్షిక సదస్సు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమాచారం పంపించడం కోసం కార్లలో వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుందని చెప్పారు. రోడ్డు నిర్మాణంలో తగిన మార్పులు చేయడం ద్వారా ప్రమాదాలు తగ్గిస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటించడం కోసం మోటారు వాహనాల చట్టంలో 61 సవరణలు తీసుకొస్తామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి నగదు రహిత విధానంలో వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చే స్తామని గడ్కరీ తెలిపారు. ఈ విధానాన్ని త్వరలో ప్రధాని మోదీ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇప్పటికే ఈ విధా నం ఆరు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతున్నట్టు తెలిపారు. క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలు అందక మరణాలు సంభవిస్తున్నందున దాన్ని నివారించడానికే నగ దు రహిత వైద్య సేవలు అందించనున్నట్టు చెప్పారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి రూ.1.5 లక్షల మేర, గరిష్ఠంగా వారంరోజుల పాటు చికిత్సలు అందించడమే ఈ పథకం లక్ష్యమన్నారు.