ఏఐ నైపుణ్యానికి భారీ నజరానా!
ABN , Publish Date - Aug 28 , 2026 | 02:37 AM
పాలనలో ఏఐ వినియోగాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ నిపుణులను ఆకర్షించేందుకు నెలకు గరిష్ఠంగా రూ.4.58 లక్షలు (ఏడాదికి రూ.55 లక్షల) వేతనం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇది దేశంలో అత్యున్నత స్థాయి సివిల్ సర్వెంట్ల వేతనం కంటే దాదాపు రెట్టింపు ఉండడం గమనార్హం.
నెలకు రూ.4.58 లక్షల వరకూ జీతం
సీనియర్ సివిల్ సర్వెంట్ల కంటే రెట్టింపు
కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత
న్యూఢిల్లీ, ఆగస్టు 27: పాలనలో ఏఐ వినియోగాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ నిపుణులను ఆకర్షించేందుకు నెలకు గరిష్ఠంగా రూ.4.58 లక్షలు (ఏడాదికి రూ.55 లక్షల) వేతనం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇది దేశంలో అత్యున్నత స్థాయి సివిల్ సర్వెంట్ల వేతనం కంటే దాదాపు రెట్టింపు ఉండడం గమనార్హం. సప్లయర్ ఏజెన్సీల ప్యానెల్ ద్వారా ప్రభుత్వం ఏఐ నిపుణులను నియమించుకోనుంది. కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ ఈ నెలలో తిరిగి జారీచేసిన రిక్వెస్ట్ ఫర్ ఎంప్యానెల్మెంట్ (ఆర్ఎఫ్ఈ)లో వేతన గణాంకాలు ఉన్నాయని ఓ ఇంగ్లిష్ వార్తా వైబ్సైట్ పేర్కొంది. ప్రభుత్వం గతేడాది నవంబరులో మొదటి టెండర్ను ఆహ్వానించగా, దాదాపు80 మంది బిడ్డర్లు ముందుకు వచ్చారు. సాంకేతిక, ఆర్థిక విశ్లేషణ తర్వాత టీసీఎస్, ఎన్ఈసీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కిండ్రిల్ సొల్యూషన్స్, కాక్టస్ టెక్నాలజీ సొల్యూషన్స్, కోరోవర్, ఇన్నెఫు ల్యాబ్స్ సంస్థలను ఏప్రిల్లో ఎంప్యానెల్ చేసి, వాటికి ఎంప్యానెల్మెంట్ లేఖలను జారీచేశారు. కాగా, ఏఐ/సొల్యూషన్స్ అర్కిటెక్ట్, డేటా సైన్స్ లీడ్, ఏఐ/ఎంఎల్ లీడ్లకు నెలకు రూ.4,58,500ఫీజుగా రేట్కార్డులో నిర్ణయించారు. ప్రోగ్రామ్ లేదా ప్రోడక్ట్ మేనేజర్ రూ.4,12,500, డైటా ఇంజనీరింగ్ లీడ్ రూ.3,66,666, ఏఐ/ఎంఎల్ ఇంజినీర్, డేటా సైంటిస్ట్, ఎంఎల్ఓపీ లీడ్కు రూ.3,32,834 చెల్లిస్తారు. తక్కువలో తక్కువగా బిజినెస్ అనలిస్టుకు నెలకు రూ.2.16 లక్షలు వస్తాయి.ప్రభుత్వ పాలనలో ఏఐ వినియోగాన్ని పెంచడం ఈ నిపుణుల బాధ్యత. ఇందులో భాగంగా ప్రభుత్వ సదుపాయాలపైనే ఏఐ ప్రోగ్రామ్లు నడిచేలా మల్టీ టెనెంట్ ఇన్ఫరెన్స్ సర్వర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్ఈజీడీ పేర్కొంది.