లాక్డౌన్ ఆలోచనే లేదు
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:27 AM
పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులతో ప్రపంచ ముడి చమురు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఎడతెగని యుద్ధ వాతావరణం దేశీయ చమురు మార్కెట్ను కుదేలు చేస్తోంది.
అవన్నీ వదంతులే..వాటిని నమ్మొద్దు: కేంద్రం
న్యూఢిల్లీ, మార్చి 27: పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులతో ప్రపంచ ముడి చమురు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఎడతెగని యుద్ధ వాతావరణం దేశీయ చమురు మార్కెట్ను కుదేలు చేస్తోంది. మరోవైపు తిరిగి లాక్డౌన్ ప్రకటించవచ్చునన్న వార్తలు మరింతగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. లాక్డౌన్ వార్తలను ఖండిస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘దేశంలో లాక్డౌన్ విధిస్తారనేది ఊహాగానమే. అలాంటి ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. ఇలాంటి వదంతులు దేశానికి హాని కలిగిస్తాయి. ఇలాంటి వార్తల నుంచి ప్రజలు దూరంగా ఉండాలి.’’ అని మంత్రి కోరారు. చమురు సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చూడటంతోపాటు దేశీయంగా వినియోగదారుల అవసరాలను తీర్చడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరల భారాన్ని ప్రజలపై వేయకుండా, ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోందని వివరించారు.