ఆ పేపర్లు మావి కావు..!
ABN , Publish Date - May 26 , 2026 | 05:24 AM
సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వాల్యుయేషన్ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. బోర్డు అధికారికంగా అప్లోడ్ చేసిన జవాబు పత్రాల స్కాన్ కాపీలు తమవి...
సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వాల్యుయేషన్లో విద్యార్థుల ఆరోపణలు.. నెట్టింట వైరలైన పోస్టులు
న్యూఢిల్లీ, మే 25: సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వాల్యుయేషన్ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. బోర్డు అధికారికంగా అప్లోడ్ చేసిన జవాబు పత్రాల స్కాన్ కాపీలు తమవి కావు అని, అందులోని చేతిరాతలు వేరే వాళ్లవని కొందరు విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పరీక్షల మూల్యాంకనంలో ప్రవేశపెట్టిన ‘ఆన్స్ర్కీన్ మార్కింగ్’ (ఓఎస్ఎమ్) విధానంలో జరిగిన సాంకేతిక లోపాల వల్లే విద్యార్థుల పేర్లు పరస్పరం తారుమారయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీకి చెందిన వేదాంత్ అనే 12వ తరగతి విద్యార్థి తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిజిక్స్ పరీక్షలో ఆశించిన దానికంటే తక్కువ మార్కులు రావడంతో, వేదాంత్ రీ-వాల్యుయేషన్ ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే బోర్డు అప్లోడ్ చేసిన కాపీలోని చేతిరాత, అక్షరాల శైలి తన ఇతర పేపర్లతో అస్సలు మ్యాచ్ కావడం లేదని, ఇది అసలు తన పేపరే కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ దాదాపు 2.5 మిలియన్ల వ్యూస్తో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇదే తరహాలో మరికొందరు విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ వివాదంపై సీబీఎస్ఈ వర్గాలు స్పందిస్తూ విద్యార్థుల నుంచి వస్తున్న ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యమున్న అంశంగా తీసుకుని పరిశీలిస్తున్నామని వెల్లడించాయి.