టార్గెట్ తెలంగాణ?
ABN , Publish Date - May 05 , 2026 | 06:09 AM
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక.. కర్ణాటక, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలపై బీజేపీ దృష్టి సారించే అవకాశం ఉంది. వచ్చే రెండేళ్లలో 16 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా...
ఇక పంజాబ్, తెలంగాణ, కర్ణాటకపై బీజేపీ దృష్టి
10న తెలంగాణలో మోదీ పర్యటన.. రూ.వేల కోట్ల ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం
న్యూఢిల్లీ,మే 4 (ఆంధ్రజ్యోతి): ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక.. కర్ణాటక, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలపై బీజేపీ దృష్టి సారించే అవకాశం ఉంది. వచ్చే రెండేళ్లలో 16 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా, 2029లో బీజేపీ నిలదొక్కుకోవాలంటే ఈ రాష్ట్రాల్లో విజయం సాధించడం అత్యంత కీలకమన్న వాదన వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్లో అధికారం నిలబెట్టుకోవడంతోపాటు పంజాబ్, హిమాచల్లో అధికారం దక్కించుకుని తీరాలని బీజేపీ భావిస్తోంది. అలాగే, 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,ఛత్తీస్గఢ్ త్రిపురలో అధికారం నిలబెట్టుకోవడంతోపాటు కర్ణాటక, తెలంగాణ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్లో గెలిచి తీరాలని బీజేపీ ఆకాంక్షిస్తోంది. వీటిలో పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలిచేందుకు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందన్న అంచనాలున్నాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలను తమ వైపునకు తిప్పుకోవడం, ఆ పార్టీని బలహీనపర్చడమే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు బీజేపీ ఎత్తుగడలు పెద్దగా ఫలించలేదన్న వాదన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 10న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనుండడం.. ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా మోదీ తెలంగాణలో రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించనున్నట్లు తెలిసింది. కాగా, కీలక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణపైనా మోదీ దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతోంది.పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం కల్పించాలన్న విషయమై మోదీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అలా తొలగించే వారిని పార్టీ పదవుల్లో నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. విస్తరణలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ నేతలకు ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.