జాతీయ పార్టీల ఆదాయంలో బీజేపీదే హవా!
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:04 AM
దేశంలోని 6 జాతీయ పార్టీలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. రూ.7,960 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, అందులో 85 శాతానికి పైగా....
6 పార్టీల ఆదాయం 7, 960 కోట్లు..అందులో కమలం వాటానే 85శాతం.
రెండో స్థానంలో కాంగ్రెస్.. ఏడీఆర్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): దేశంలోని 6 జాతీయ పార్టీలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. రూ.7,960 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, అందులో 85 శాతానికి పైగా వాటా బీజేపీ ఖాతాలోకే చేరింది. పార్టీల ఆదాయ, వ్యయాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మొత్తం ఆదాయం లో రూ. 6769.14 కోట్లు బీజేపీకే దక్కడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే ఆ పార్టీ ఆదాయం రూ.2428 కోట్లు పెరిగింది. బీజేపీ తన ఆదాయంలో రూ.3774.58 కోట్లు ఖర్చు చేయగా, అందులో రూ.3335.36 కోట్లు కేవలం ఎన్నికల ప్రచారం కోసమే వెచ్చించింది. మరోవైపు, కాంగ్రెస్ ఆదాయం గతేడాదితో పోలిస్తే 25ు మేర తగ్గి రూ.918.28 కోట్లుగా నమోదైంది. సీపీఎం రూ.172.60 కోట్లు, బీఎస్పీ రూ.58.58 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 39.28 కోట్లు, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీఈపీ) రూ.2.18 కోట్ల ఆదాయం ఉన్న ట్లు నివేదిక పేర్కొంది. ఆదాయం కంటే ఎక్కువగా కాంగ్రెస్ రూ.1111.94 కోట్లు ఖర్చు పెట్టగా.. బీఎస్పీ 81 శాతం అదనంగా ఖర్చు చేసింది. ఆడిట్ నివేదికల సమర్పణలో.. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంలు గడువు దాటిన తర్వాత వివరాలు అందజేసినట్లు ఏడీఆర్ రిపోర్టు స్పష్టం చేసింది.