Share News

‘భారత్‌ ట్యాక్సీ’ సేవలు ప్రారంభం

ABN , Publish Date - Feb 06 , 2026 | 02:38 AM

దేశంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే తొలి క్యాబ్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘భారత్‌ ట్యాక్సీ’ సేవలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్‌షా ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో గురువారం లాంఛనంగా ప్రారంభించారు...

‘భారత్‌ ట్యాక్సీ’ సేవలు ప్రారంభం

  • తొలుత ఢిల్లీ, గుజరాత్‌లో అందుబాటులోకి

  • రెండేళ్లలో అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తాం: అమిత్‌షా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే తొలి క్యాబ్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘భారత్‌ ట్యాక్సీ’ సేవలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్‌షా ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. పైలట్‌ ప్రాజెక్టుగా రెండు నెలలు విజయవంతంగా పూర్తిచేసుకున్న అనంతరం ఈ సేవలు ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చా యి. వచ్చే రెండేళ్లలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ సేవలు విస్తరించనున్నట్లు అమిత్‌షా తెలిపారు. మూడేళ్లలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య (అస్సోం) వరకు ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. దీని ద్వారా వచ్చే లాభాలు నేరుగా డ్రైవర్లకే పంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ యాప్‌ ద్వారా కార్లు, ఆటోలు, బైక్‌ ట్యాక్సీలను బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం దేశంలో క్యాబ్‌ బుకింగ్‌ సేవల్లో ఉబర్‌, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేట్‌ సంస్థలు ఆధిపత్యం వహిస్తున్న నేపథ్యంలో భారత్‌ ట్యాక్సీ వాటికి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. 2025, జూన్‌ 6న కేంద్రం ఈ యాప్‌ను రూపొందించింది. ఇది జీరో కమీషన్‌, సర్జ్‌ ప్రైసింగ్‌ లేని విధానంలో పనిచేస్తూ, లాభాలను నేరుగా డ్రైవర్లకే పంపిణీ చేస్తోంది. ఎనిమిది ప్రముఖ సహకార సంస్థల మద్దతుతో 2025, డిసెంబరు 2న ఢిల్లీ, గుజరాత్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. భారత్‌ ట్యాక్సీ ప్రపంచంలోనే మొదటి, అతిపెద్ద సహకార ఆధారిత క్యాబ్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా, డ్రైవర్లే ఓనర్లు కలిగిన రైడ్‌ బుకింగ్‌ యాప్‌ గా అవతరించిందని సహకార మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ యాప్‌లో 3 లక్షలకు పైగా డ్రైవర్లు, లక్షకు పైగా వినియోగదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని పేర్కొంది. సుమారు రూ.10 కోట్ల లాభాలను డ్రైవర్లకు పంపిణీ చేసినట్లు చెప్పింది. డ్రైవర్లకు ‘సారథి’ పేరిట ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పదవీ విరమణ ప్రయోజనాలను ఈ యాప్‌ అందిస్తోంది. ఢీల్లీలో ఏడుచోట్ల సపోర్ట్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి.

Updated Date - Feb 06 , 2026 | 02:38 AM