డబ్బు కోసం క్లాస్మేట్ కిడ్నాప్
ABN , Publish Date - Apr 14 , 2026 | 06:42 AM
వారంతా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు. అంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు వయసువారే. విలాసాలకు అలవాటు పడిన వీరు డబ్బు కోసం క్లాస్మేట్నే కిడ్నాప్ చేశారు.
బెంగళూరులో నలుగురు విద్యార్థుల అరెస్టు
బెంగళూరు, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): వారంతా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు. అంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు వయసువారే. విలాసాలకు అలవాటు పడిన వీరు డబ్బు కోసం క్లాస్మేట్నే కిడ్నాప్ చేశారు. బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ విద్యార్థి కిడ్నాప్ వ్యవహారాన్ని మడివాళ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆగ్నేయ విభాగ డీసీపీ ముహమ్మద్ సుజీత సోమవారం ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నగరంలోని ఓ కళాశాలలో చదువుతున్న ఆదిత్యభోస్లే, శౌర్య అగర్వాల్, నిక్కు సుల్తాని, సయ్యద్ మొహమ్మద్ బిలాల్ విలాసాలకు అలవాటుపడ్డారు. నలుగురూ కూడబలుక్కుని తమ సహ విద్యార్థి మహంతిని కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేయాలని స్కెచ్ వేశారు. శనివారం రాత్రి హాస్టల్ వద్ద కారు సిద్ధం చేసుకున్నారు. మహంతి రాగానే అందు లో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. ఓ గదిలో బంధించారు. రూ.50వేలిస్తే వదిలేస్తామన్నారు. ఆ విద్యార్థి.. తన మిత్రుడికి ఫోన్ చేసి రూ.10వేలు యూపీఐ ద్వారా జమ చేయించారు. డబ్బులు పంపిన మిత్రుడు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ ట్రాకింగ్ ద్వారా వారున్న ప్రదేశాన్ని గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి నకిలీ మెటల్గన్, కారును స్వాధీనం చేసుకున్నారు.