నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:26 AM
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు శుక్రవారం సమ్మె పాటించనున్నాయి.
వరుసగా 4 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: చాలా కాలంగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు శుక్రవారం సమ్మె పాటించనున్నాయి. వారానికి ఐదు రోజుల పని దినాల విధానం అమలు సహా పలు డిమాండ్ల సాధనకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎ్ఫబీసీ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో సెప్టెంబరు 11న వివిధ బ్యాంకుల శాఖలు మూతపడనున్నాయి. లావాదేవీల నిర్వహణకు ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం కేంద్రాలు వంటి ప్రత్యామ్నాయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే, బ్యాంకు ఉద్యోగుల సంఘాలు శుక్రవారం మాత్రమే బంద్కు పిలుపునిచ్చినప్పటికీ.. వరుసగా నాలుగు రోజుల పాటు ఆ ప్రభావం ఉండనుంది. శుక్రవారం సమ్మె కాగా శని(నెలలో రెండో శనివారం), ఆదివారాలు సాధారణంగానే బ్యాంకులకు సెలవు దినాలు. ఇక, వినాయక చవితి సందర్భంగా చాలా రాష్ట్రాల్లో సోమవారం బ్యాంకులకు సెలవు దినంగా ఇప్పటికే ప్రకటించారు. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు పలు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశముంది.