నాసిక్లో కీచక జ్యోతిషుడు!
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:13 AM
ఆయనో ప్రముఖ జ్యోతిషుడు! దైవిక శక్తులున్నాయనే విశ్వాసంతో బడా రాజకీయనేతలు, వ్యాపారులు ఆయన ప్రాపకం కోసం క్యూ కడుతున్నారు.
వ్యక్తిగత సమస్యలతో వచ్చిన 58 మంది మహిళలకు మత్తుమందిచ్చి అత్యాచారం
ముంబై, మార్చి 19: ఆయనో ప్రముఖ జ్యోతిషుడు! దైవిక శక్తులున్నాయనే విశ్వాసంతో బడా రాజకీయనేతలు, వ్యాపారులు ఆయన ప్రాపకం కోసం క్యూ కడుతున్నారు. ఆ జ్యోతిష్యుడేమో తన వద్దకొచ్చే మహిళలను జ్యోతిష్యం పేరుతో ‘భవిష్యత్తు భీకరంగా ఉంటుంది’ అని ఏవేవో దొంగ మాటలు చెప్పి పూజల పేరుతో. మత్తుమందు ఇచ్చి.. వారిపై అత్యాచారానికి ఒడిగడతాడు! ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరిస్తాడు. ఆ వీడియోలతో బాధితులను బ్లాక్మెయిల్ చేసి పదే పదే లైంగికదాడికి పాల్పడతాడు. ఇలా 58 మంది మహిళలపై అతడు అత్యాచారం జరిపాడు. మహారాష్ట్రలోని నాసిక్లో వెలుగుచూసిన ఈ ఘటన అక్కడ ఇప్పుడు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. కామ పిశాచి అయిన ఆ జ్యోతిష్యుడు 67 ఏళ్ల అశోక్ ఖరత్. ఓ 35 ఏళ్ల మహిళ ఖరత్ ఆగడాలను భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఖరత్ కార్యాలయంపై దాడి చేసి, 58 మంది మహిళలకు సంబంధించిన అశ్లీల వీడియోలతో కూడిన పెన్డ్రైవ్ను, కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఖరత్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ కోసం ఐపీఎస్ ఆఫీసర్ తేజస్విని నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.