అబ్బే...మేం టీవీకేకు మద్దతు ఇవ్వలేదు
ABN , Publish Date - May 23 , 2026 | 05:28 AM
తమ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్))పై తిరుగుబావుటా ఎగురవేయడంతో పాటు టీవీకే ప్రభుత్వానికి మద్దతు పలికిన అన్నాడీఎంకే అసమ్మతివర్గ ఎమ్మెల్యేలు తమకు మంత్రి..
మేం పార్టీ నుంచి విడిపోలేదు.. మావి అభిప్రాయ భేదాలే
మా అధినేత పళనిస్వామే: అన్నాడీఎంకే అసమ్మతి నేతలు
చెన్నై, మే 22 (ఆంధ్రజ్యోతి): తతమ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్))పై తిరుగుబావుటా ఎగురవేయడంతో పాటు టీవీకే ప్రభుత్వానికి మద్దతు పలికిన అన్నాడీఎంకే అసమ్మతివర్గ ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవులు రావని తేలిపోవడంతో మాటమార్చారు. తాము టీవీకే ప్రభుత్వానికి మద్దతు పలకలేదని, అసలు మంత్రిపదవుల గురించి టీవీకేతో ఎలాంటి చర్చలే జరగలేదని స్పష్టం చేశారు. అసమ్మతివర్గ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం శుక్రవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ.. తమకు అధినేత...పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయాలనే తామంతా డిమాండ్ చేశాం తప్ప, మరో ఉద్దేశమేమీ లేదని పేర్కొన్నారు. తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవని, కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే నెలకొన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా టీవీకేకు సానుకూల తీర్పునిచ్చారని, అన్నాడీఎంకే ఎల్లప్పుడూ డీఎంకేని వ్యతిరేకించే పార్టీగానే ఉందని తెలిపారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలేమిటన్న విషయంపై చర్చించేందుకే సర్వసభ్యమండలిని సమావేశపరచాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. పార్టీని రెండుగా చీల్చే యోచనలు తమ వర్గానికి లేదని, రాష్ట్రంలో మళ్లీ జయ పాలనను స్థాపించడమే అన్నాడీఎంకే నేతలందరి ఏకైక లక్ష్యమని వేలుమణి చెప్పారు.