Share News

నాపై దాడి వెనుక ఆర్‌ఎస్సెస్‌ హస్తం ఉంది

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:51 AM

రాజస్థాన్‌లోని జైపూర్‌లో తనపై జరిగిన దాడి వెనుక ఆర్‌ఎస్సెస్‌ హస్తం ఉందని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజీపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఆరోపించారు.

నాపై దాడి వెనుక ఆర్‌ఎస్సెస్‌ హస్తం ఉంది

  • విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి

  • ఎన్నికల్లో పోటీ చేయబోం.. సీజేపీ చీఫ్‌ అభిజీత్‌ దీప్కే

నాగ్‌పూర్‌, జూన్‌ 16: రాజస్థాన్‌లోని జైపూర్‌లో తనపై జరిగిన దాడి వెనుక ఆర్‌ఎస్సెస్‌ హస్తం ఉందని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజీపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఆరోపించారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడానికి, విద్యార్థుల గొంతు నొక్కడానికే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నాగ్‌పూర్‌లోని సంవిధాన్‌ చౌక్‌ వద్ద భారీ నిరసన ప్రదర్శన తలపెట్టారు. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న దీప్కే మీడియాతో మాట్లాడారు. కోటి మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు అన్యాయానికి గురైందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో లేదని స్పష్టం చేశారు. ‘‘ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ట్వీట్‌ చేసే ప్రధాని, మనదేశ విద్యార్థులు చనిపోతుంటే కనీసం ఒక్క సంతాప ట్వీట్‌ కూడా చేయలేదు. ప్రధాని మొదట ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి. మోదీ గారు.. మీ ‘మన్‌ కీ బాత్‌’, ‘పరీక్షా పే చర్చ’లు ఆపి, కనీ సం ఇప్పటికైనా విద్యార్థుల మనసులోని మాటను వినండి’’ అని ఆయన హితవు పలికారు.

Updated Date - Jun 17 , 2026 | 03:52 AM