హోర్ముజ్లో ఆగిపోయిన నౌకల్లో 562 మంది భారత నావికులు
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:42 AM
హోర్ముజ్ జలసంధిలో భారతీయ పతాకాలున్న 13 వాణిజ్య నౌకలు గత 108 రోజులుగా చిక్కుకుపోయాయి. వాటిల్లో మొత్తం 562 మంది భారతీయ నావికులు ఉన్నారు.
108 రోజులుగా దుర్భరంగా వారి జీవితాలు
న్యూఢిల్లీ, జూన్ 14: హోర్ముజ్ జలసంధిలో భారతీయ పతాకాలున్న 13 వాణిజ్య నౌకలు గత 108 రోజులుగా చిక్కుకుపోయాయి. వాటిల్లో మొత్తం 562 మంది భారతీయ నావికులు ఉన్నారు. జలసంధి పశ్చిమభాగంలో 329 మంది, తూర్పు భాగంలో 233 మంది ఉన్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. వారంతా గత మూడున్నర నెలలుగా సముద్రంలో నౌకల్లోనే దుర్బర జీవితాలు గడుపుతున్నారు. తమ నౌకను ఎటు కదిలిస్తే ఏ క్షిపణి వచ్చి మీదపడుతుందోనన్న భయంతో ఉన్నచోటనే కాలం వెళ్లదీస్తున్నారు. ఒమన్ తీరంలోని దఖమ్ పోర్టు వద్ద నిలిపి ఉంచిన ఎంటీ సెలెస్టియల్ అనే నౌకలో నిషాంత్ ఉర్తనాథన్ అనే నావికుడు ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. మృతదేహాన్ని వెంటనే భారత్కు తరలించే పరిస్థితి లేకపోవటంతో అది కుళ్లిపోకుండా ఉండేందుకు తోటి నావికులు దానిని చల్లని ఉప్పునీటిలో భద్రపర్చినట్లు తెలిసింది. మరోవైపు, ఒమన్ తీరంలోనే ఉన్న విరాట్-1 అనే నౌక ఇంజన్ విఫలం కావటంలో ఆదివారం సముద్రంలో మునిగిపోయింది. అందులోని 14 మంది భారత నావికులను ఒమన్ కోస్ట్గార్డు సహాయంతో రక్షించారు.