టీఎంసీ నిధులు 440 కోట్లు ఫ్రీజ్
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:03 AM
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత నిలువునా చీలిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
పార్టీ చీలిక వర్గం ఫిర్యాదుతో స్తంభింపజేసిన పోలీసులు
కోల్కతా, జూన్ 20: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత నిలువునా చీలిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన రూ.440 కోట్ల నిధులను పోలీసులు స్తంభింపజేశారు. పార్టీకి బ్యాంకు ఖాతాల్లో రూ.676.11 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. అయితే, అసలైన టీఎంసీ తమదేనని, పార్టీ గుర్తుతో సహా ఆస్తులు కూడా తమకే దక్కుతాయని చీలిక వర్గం వాదిస్తోంది. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని ఈ చీలిక వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఈ నిల్వలను స్తంభింపజేయాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సొమ్ము అక్రమ మార్గాల ద్వారా సేకరించినదని, దానిని ఎవరెవరి నుంచి ఎలా సేకరించారో దర్యాప్తు నిర్వహించాలని కోరారు. వెంటనే స్పందించిన పోలీసులు మూడు బ్యాంకుల్లో ఉన్న రూ.440 కోట్లను శనివారం ఫ్రీజ్ చేశారు. ఇకపై ఈ డబ్బును బ్యాంకు ఖాతాల నుంచి తీసుకోవటం, ఇతర ఖాతాలకు మళ్లించటం కుదరదని చెప్పారు.