వెటరన్ జర్నలిస్ట్ మార్క్ టులీ మృతి
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:12 AM
వెటరన్ బ్రిటీషు జర్నలిస్ట్, బీబీసీ మాజీ బ్యూరో చీఫ్సర్ విలియం మార్క్ టులీ(90) ఆదివారం మృతి చెందారు. స్థానికంగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్క్ టులీ మృతి చెందినట్లు ఆయన సన్నిహిత మిత్రుడు సతీష్ జాకబ్ తెలిపారు.
బీబీసీ బ్యూరో చీఫ్గా భారత్లో సేవలు
చంద్రబాబుపై తన రచనల్లో ప్రశంసలు
న్యూఢిల్లీ, జనవరి 25: వెటరన్ బ్రిటీషు జర్నలిస్ట్, బీబీసీ మాజీ బ్యూరో చీఫ్సర్ విలియం మార్క్ టులీ(90) ఆదివారం మృతి చెందారు. స్థానికంగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్క్ టులీ మృతి చెందినట్లు ఆయన సన్నిహిత మిత్రుడు సతీష్ జాకబ్ తెలిపారు. కోల్కతాలో 1935 అక్టోబరు 24న బ్రిటీష్ దంపతులకు జన్మించిన మార్క్ టులీ బీబీసీ బ్యూరో చీఫ్గా భారత్లో 22 ఏళ్లు పనిచేశారు. బీబీసీ రేడియో 4 కార్యక్రమం ‘సమ్థింగ్ అండర్స్టుడ్’ సమర్పకుడిగానూ వ్యవహరించారు. రచయితగా భారత్పై అనేక పుస్తకాలు రాశారు. పలు డాక్యుమెంటరీల రూపకల్పనలోనూ పాల్గొన్నారు. 2002లో బ్రిటీష్ నైట్హుడ్ అవార్డు అందుకున్నారు. 2005లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అందుకున్నారు. బీబీసీ బ్యూరో చీఫ్గా భారత్కు సంబంధించిన అనేక ముఖ్య ఘటనలను ఆయన కవర్ చేశారు. మార్క్ టులీరాసిన 10 పుస్తకాల్లో భారతే ప్రధాన అంశం. కాగా హైదరాబాద్ను టెక్నాలజీ కేంద్రంగా మార్చేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా రికార్డు చేశారు. ‘ఇండియా ఇన్ స్లో మోషన్’ అనే పుస్తకంలో ఆయన ‘క్రియేటింగ్ సైబరాబాద్’ అనే ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారు.