హోర్ముజ్లో సీమైన్స్ తొలగిస్తున్నాం
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:29 AM
హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన సముద్రపు మందుపాతరలు (సీమైన్స్) తొలగించే ఆపరేషన్ చేపట్టామని, ఈ క్రమంలో రెండు అమెరికా యుద్ధ నౌకలు జలసంధిని ..
అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన
వాషింగ్టన్/టెహ్రాన్, ఏప్రిల్ 11: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన సముద్రపు మందుపాతరలు (సీమైన్స్) తొలగించే ఆపరేషన్ చేపట్టామని, ఈ క్రమంలో రెండు అమెరికా యుద్ధ నౌకలు జలసంధిని దాటాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ‘‘యూఎ్సఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్, యూఎ్సఎస్ మిఖాయెల్ మర్ఫీ యుద్ధ నౌకలు హోర్ముజ్ జలసంధి దాటి అరేబియన్ గల్ఫ్ ప్రాంతంలోకి ప్రవేశించాయి. ఐఆర్జీసీ పెట్టిన సీమైన్స్ను పూర్తిగా తొలగించి.. వాణిజ్య నౌకలకు భద్రమైన మార్గాన్ని సిద్ధం చేసే ప్రక్రియ మొదలుపెట్టాం’’ అని సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. నీటిలో ప్రయాణించే డ్రోన్లు సహా ఇతర ఆయుధాలతో అమెరికా బలగాలు ఈ ఆపరేషన్లో భాగం కానున్నాయని తెలిపారు. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ ప్రకటన చేయక ముందే.. అమెరికా నౌకలు హోర్ముజ్ దాటాయంటూ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వాటిని ఇరాన్ సైన్యం ఖండించింది. ఒక్క అమెరికా నౌక కూడా హోర్ముజ్ దాటలేదని తెలిపింది. హోర్ముజ్ను దాటడానికి అమెరికా యుద్ధనౌకలు ప్రయత్నించాయని తెలిపింది. అలా చేస్తే 30 నిమిషాల్లో పేల్చేస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించడంతో.. నౌకలు వెనక్కి మళ్లాయని పేర్కొంది. ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధిలో సీమైన్స్ను తొలగించి శుభ్రం చేసే ప్రక్రియ మొదలుపెట్టామని ట్రంప్ ప్రకటించారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ సహా ప్రపంచ దేశాల కోసం తాము హోర్ముజ్ను తెరుస్తున్నామని, వారికి ఆ ధైర్యం లేదని చెప్పారు.