37 రోజుల్లో.. 40 విమానాలు నేలమట్టం..!
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:39 AM
ఇరాన్తో 37 రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా ఇప్పటివరకూ దాదాపు 40 యుద్ధ విమానాలను కోల్పోయింది. గత 20 ఏళ్లలో శత్రుదేశం దాడిలో అమెరికా ఈ స్థాయిలో...
ఇరాన్తో యద్ధంలో అమెరికాకు భారీ నష్టం
ఇరాన్ కోల్పోయింది కూడా 40 విమానాలే
వాషింగ్టన్, ఏప్రిల్ 6: ఇరాన్తో 37 రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా ఇప్పటివరకూ దాదాపు 40 యుద్ధ విమానాలను కోల్పోయింది. గత 20 ఏళ్లలో శత్రుదేశం దాడిలో అమెరికా ఈ స్థాయిలో వైమానిక శక్తిని కోల్పోవడం ఇదే తొలిసారి. అమెరికా కోల్పోయిన వాటిలో ఒక ఎఫ్-35, నాలుగు ‘ఎఫ్-15ఈ స్ర్టైక్ ఈగల్’ ఫైటర్ జెట్లు, 17 ‘ఎంక్యూ-9 రీపర్లు’, రెండు ‘ఏ-10 వార్త్హాగ్’ దాడి విమానాలు, ఎనిమిది కేసీ-135 స్టార్టోట్యాంకర్స్ ఇంధన సరఫరా విమానాలు, రెండు ఈ-3 ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్, కంట్రోల్ విమానాలు, రెండు సీ-130 సైనిక రవాణా విమానాలతోపాటు ఐదు హెలికాప్టర్లు ఉన్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే.. అమెరికా-ఇజ్రాయెల్ దెబ్బకు విలవిల్లాడిపోతుందని భావించిన ఇరాన్ కూడా 40 విమానాలనే కోల్పోయింది. ఇజ్రాయెల్ ఇప్పటివరకూ ఒక్క యుద్ధ విమానాన్ని కూడా కోల్పోలేదు కానీ.. 18 డ్రోన్లను మాత్రం నేలమట్టమయ్యాయి.
తొలిసారి నేలకొరిగిన ఎఫ్-35
ఈ ఏడాది మార్చి 19న ఇరాన్ చేసిన వైమానిక దాడుల్లో అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానం దెబ్బతింది. కదన రంగంలో ఈ విమానం దెబ్బతినడం ఇదే తొలిసారి. అలాగే ఈ యుద్ధంలో అమెరికా అత్యధికంగా 17 ఎంక్యూ-9లను కోల్పోవడం కూడా ఆశ్చర్యం కలిగించింది. ఎంక్యూ-9 అనేది మధ్యస్థ ఎత్తులో ఎక్కువ సమయం ప్రయాణించే సామర్థ్యం కలిగిన మానవరహిత వైమానిక వాహనం (యూఏవీ). ఈ ఖరీదైన డ్రోన్లు అమెరికా వైమానిక దళంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2023 నుంచి యెమెన్లోని అన్సారుల్లా కూటమి దళాలతో జరిగిన యుద్ధంలోనూ అమెరికా పది ఎంక్యూ-9 యూఏవీలను కోల్పోయింది. కాగా..ఈ యుద్ధంలో ఇరాన్కు అతిపెద్ద నష్టం ఏదైనా ఉందంటే.. అది చైనాకు చెందిన పది జే-7 యుద్ధ విమానాలను కోల్పోవడమే.