రంగంలోకి అమెరికా సైన్యం!
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:03 AM
చమురు క్షేత్రాలపై పరస్పర దాడులతో ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మరో దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో..
ఇరాన్ తీరంలో మోహరింపు
‘రాయిటర్స్’ కథనంలో వెల్లడి
వాషింగ్టన్, మార్చి 19: చమురు క్షేత్రాలపై పరస్పర దాడులతో ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మరో దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. పశ్చిమాసియాలోకి భారీగా అదనపు బలగాలను దింపాలనే నిర్ణయానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చినట్టు తెలిసింది. 90 శాతం చమురు నిల్వలను కలిగిన ఇరాన్లోని ఖర్గ్ ద్వీపంపైనా సైనిక ముట్టడి జరిపే అంశంపై ఉన్నత స్థాయిలో చర్చలు జరిపినట్లు ఉన్నతాధికార వర్గాలను ఉటంకిస్తూ ప్రపంచ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని అనుసరించి, యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను భారీగా విస్తరించాలని ట్రంప్ నిర్ణయించారు. హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితిని మామూలు స్థితికి తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నారు. చమురు సమృద్ధ ఖర్గ్ ద్వీపంపై అదనపు బలగాలతో దాడులు పెంచాలనేది ట్రంప్ లక్ష్యం. అయితే, ఇది రిస్క్తో కూడిన ఆపరేషన్ అవుతుందని ట్రంప్కు ఉన్నతాధికారులు నివేదించారు.