పశ్చిమాసియాలోనే బలగాలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:23 AM
పూర్తిస్థాయి ఒప్పందం కుదిరే వరకు అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, మిలిటరీ సిబ్బంది, అదనపు ఆయుధాలు అంతా కూడా...
ఒప్పందం కుదరకపోతే.. ఎన్నడూ చూడని స్థాయిలో భారీ దాడులు చేస్తాం: ట్రంప్
వాషింగ్టన్, ఏప్రిల్ 9: పూర్తిస్థాయి ఒప్పందం కుదిరే వరకు అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, మిలిటరీ సిబ్బంది, అదనపు ఆయుధాలు అంతా కూడా పశ్చిమాసియాలో, ఇరాన్ చుట్టూరా కేంద్రీకృతమై ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే బలహీనమైన శత్రువును అవసరమైతే మరింతగా ఘోరంగా దెబ్బతీసేందుకు సిద్ధంగా ఉంటాయని చెప్పారు. తమ సైన్యం విశ్రాంతి తీసుకుంటోందని, విరామ సమయంలో పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతుందని తెలిపారు. తదుపరి జైత్రయాత్ర కోసం ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే.. ఇంతకుముందెన్నడూ చూడనంత భారీ స్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ వద్ద ఎన్నటికీ అణ్వాయుధాలు ఉండవని, హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని చెప్పారు. కాగా, ఇరాన్పై యుద్ధం, హోర్ముజ్ జలసంధి తెరిచే అంశంలో ముందుకురాని నాటో దేశాలపై ట్రంప్ మరోసారి మండిపడ్డారు. తమకు అవసరమైనప్పుడు నాటో సహాయంగా రాలేదని, భవిష్యత్తులోనూ రాదని పేర్కొన్నారు. నాటోతోపాటు తమ దేశానికి చెందిన వారికి కూడా తీవ్రమైన ఒత్తిడి పెట్టేవరకు ఏదీ అర్థం చేసుకోలేరని విమర్శించారు. ఏమాత్రం సరిగా నిర్వహించకుండా వదిలేసిన గ్రీన్లాండ్ను గుర్తుకుతెచ్చుకోవాలన్నారు.