నేను లేకుంటే పాక్ ప్రధాని చచ్చేవాడు
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:08 AM
భారత్-పాక్ యుద్ధం సమయంలో తాను కల్పించుకోకుంటే పాకిస్థాన్ ప్రధాని చనిపోయేవాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరపాటున వ్యాఖ్యానించారు.
అది 35 లక్షల మంది ప్రజల మాట అంటూ నోరుజారిన అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్, ఫిబ్రవరి 25: భారత్-పాక్ యుద్ధం సమయంలో తాను కల్పించుకోకుంటే పాకిస్థాన్ ప్రధాని చనిపోయేవాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరపాటున వ్యాఖ్యానించారు. తాను లేకుంటే భారత్-పాక్ మధ్య అణుయుద్ధం జరిగి ఉండేదని మరోసారి పేర్కొన్నారు. అమెరికా స్టేట్ ఆఫ్ యూనియన్ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘అమెరికన్లకు దేశంలో, బయటా భద్రతను పునరుద్ధరించినందుకు గర్వపడుతున్నాను. నేను రెండోసారి అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఎనిమిది యుద్ధాలు ఆపాను. భారత్-పాక్ మధ్య అణుయుద్ధం జరిగి ఉండేది. నేను కల్పించుకోకుంటే పాక్ ప్రధాని చనిపోయేవారని 3.5 కోట్ల మంది ప్రజలు చెప్పారు’’ అని పేర్కొన్నారు. అయితే తాను జోక్యం చేసుకోకుంటే 3.5 కోట్ల మంది ప్రజలు చనిపోయేవారని పాక్ ప్రధాని అన్నారని చెప్పబోయి ట్రంప్ పొరపాటు పడినట్టు విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కాగా,భారత్ నుంచి దిగుమతి అయ్యే సౌర విద్యుత్ పరికరాలపై అమెరికా 126 శాతం సుంకం విధించింది. భారత్ సౌర విద్యుత్ పరికరాల పరిశ్రమలకు అడ్డగోలుగా సబ్సిడీలు ఇస్తుండటంతో అవి తక్కువ ధరకే అమెరికా మార్కెట్ను ముంచెత్తుతున్నాయని పేర్కొంది.