Share News

Pakistan Sought US Help: భారత్‌ను ఆపండి ప్లీజ్‌!

ABN , Publish Date - Jan 08 , 2026 | 03:12 AM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో.. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడి చేసినప్పుడు మన దాయాది దేశం అగ్రరాజ్యాన్ని శరణుజొచ్చింది....

Pakistan Sought US Help: భారత్‌ను ఆపండి ప్లీజ్‌!

  • ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో అమెరికాకు అరవైసార్లు మొరపెట్టుకున్న పాకిస్థాన్‌ సర్కారు

ఇస్లామాబాద్‌, జనవరి 7: పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో.. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడి చేసినప్పుడు మన దాయాది దేశం అగ్రరాజ్యాన్ని శరణుజొచ్చింది! ‘‘ఎలాగైనా భారత్‌ను ఆపండి ప్లీజ్‌’’ అని వేడుకుంటూ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 60 భేటీలు నిర్వహించింది. ఈ మేరకు.. అమెరికాలోని పాక్‌ రాయబారులు, రక్షణ శాఖ అధికారులు అమెరికా చట్టసభల సభ్యులు, విదేశాంగ శాఖ అధికారులు, పెంటగాన్‌ వర్గాలను పదేపదే వేడుకున్నారు. ఈమెయిళ్లు, ఫోన్‌ కాల్స్‌, ప్రత్యక్ష భేటీలు.. ఇలా అన్ని మార్గాల్లోనూ వారిని సంప్రదించి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఇండియా దూకుడు నుంచి తమను కాపాడాలంటూ మొరపెట్టుకున్నారు. ప్రధాన మీడియా సంస్థలకు సంబంధించిన పాత్రికేయులను సంప్రదించి ఇంటర్వ్యూలు, బ్యాక్‌గ్రౌండ్‌ బ్రీఫింగ్స్‌ ఇస్తామని వెంటపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ‘యూఎస్‌ ఫారిన్‌ ఏజెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ (ఫారా)’ పత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. అప్పుడే కాదు.. ఆ తర్వాత కూడా ట్రంప్‌ పాలనాయంత్రాంగంతో వేగవంతమైన సంప్రదింపుల కోసం, వాణిజ్య, దౌత్యపరమైన ప్రయోజనాలను సాధించేందుకు.. వాషింగ్టన్‌కు చెందిన ఆరు ప్రముఖ లాబీ సంస్థలతో పాకిస్థాన్‌ 5 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.45 కోట్ల) విలువైన వార్షిక ఒప్పందాలు కుదుర్చుకుందని గత ఏడాది నవంబరులో ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ సంస్థ ఒక కథనంలో తెలిపింది. పాక్‌ ఇలా ‘సీడెన్‌ లా ఎల్‌ఎల్‌పీ’ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని వారాలకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌కు శ్వేతసౌధంలో ఆతిథ్యం ఇచ్చారని అందులో పేర్కొంది. న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. నిరుడు ఏప్రిల్‌-మే నెలల్లో అమెరికాలో లాబీయింగ్‌ కోసం భారత్‌ ఖర్చు చేసిన దానికన్నా పాక్‌ మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది. దీంతోపాటు.. ట్రంప్‌ను బహిరంగంగా పొగడడం, ఆయన్ను నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేయడం వంటి చర్యల వల్ల పాక్‌-అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని పేర్కొంది.

Updated Date - Jan 08 , 2026 | 03:12 AM