ప్రపంచమంతా తిరిగి అడుక్కుంటున్నాం
ABN , Publish Date - Feb 01 , 2026 | 04:33 AM
అప్పుల కోసం తాను, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కలిసి దేశాలు తిరుగుతున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు.
సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోంది
అప్పులపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్, జనవరి 31: అప్పుల కోసం తాను, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కలిసి దేశాలు తిరుగుతున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ‘మేమిద్దరం ప్రపంచమంతా తిరిగి డబ్బు అడుక్కోవడం సిగ్గుగా ఉంది. అప్పులు తీసుకోవడం మన ఆత్మగౌరవంపై పెద్ద భారం. సిగ్గుతో మేం తల వంచుకోవాల్సి వస్తోంది. ప్రతిగా వాళ్లు ఏం అడిగినా మనం కాదనలేం’ అన్నారు. అయితే, దేశ ఆర్థిక స్థితి దృష్ట్యా అలా చేయాల్సి వస్తోందని వాపోయారు. శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్లో దేశానికి చెందిన ప్రముఖ ఎగుమతిదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం మన విదేశీ మారక ద్రవ్యం దాదాపు రెట్టింపు అయ్యింది. అయితే, ఇందులో మిత్రదేశాలు ఇచ్చిన రుణాలు కలిసి ఉన్నాయి’ అని తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్థతో పాకిస్థాన్ క్రియాశీలకంగా చర్చలు జరుపుతున్న తరుణంలో షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాకిస్థాన్ ఇటీవలే ఐఎంఎఫ్ నుంచి 1.2 బిలియన్ డాలర్ల అప్పు పొందింది.