యూఎస్, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి.. నేపాల్ డిమాండ్
ABN , Publish Date - Sep 02 , 2026 | 02:13 PM
ఇటీవల తమ దేశంలో సంభవించిన వరదలకు యూఎస్, చైనా, భారత్లే బాధ్యత వహించాలని నేపాల్ చెబుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల తమ దేశంలో సంభవించిన వరదలకు యూఎస్, చైనా, భారత్లే బాధ్యత వహించాలని నేపాల్ చెబుతోంది. కర్బన ఉద్గారాలతో భూతాపం పెరిగి తమ దేశంలో ఈ భయానక ఉత్పాతం సంభవించిందని చెబుతోంది. కర్బన ఉద్గారాలు వెదజల్లే దేశాల్లో యూఎస్, చైనా, భారత్లో ముందువరుసలో ఉన్నాయని నేపాల్ అంటోంది. కాబట్టి, ఆ మూడు దేశాలు తమకు పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది.
జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ మూడు దేశాలపైనే ఉందని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ కనాల్ పేర్కొన్నారు. పర్యావరణ మార్పుల్లో నేపాల్ పాత్ర తక్కువే అయినా తాము మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ విపత్తులో నష్టపోయిన తాము న్యాయం కోసం, పరిహారం కోసం దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఈ విషయంపై చర్చించేందుకు నేపాల్ ప్రధాని బాలెన్ షా స్వయంగా ఐక్యరాజ్య సమితికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విపత్తు నేపథ్యంలో ఇప్పటికే నేపాల్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. తక్షణ అవసరాల కోసం ఉద్దేశించిన నిధి నుంచి సాయం మంజూరు చేయాలని అభ్యర్థించింది. ఈ నష్టం నుంచి బయటపడేందుకు తమకు 4 నుంచి 5 బిలియన్ డాలర్ల నిధులు అవసరమని నేపాల్ ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, నేపాల్ వరదల బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,100 దాటింది. వేల మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. నేపాల్-చైనా టిబెట్ వద్ద మంచుచరియలు విరిగిపడి వరదలు ముంచెత్తినట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. ఈ విపత్తుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు శాస్త్రపరమైన అధ్యయనాలు మరిన్ని జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
‘టైమ్స్ స్క్వేర్’లో కత్తులతో దాడి.. బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ప్రెసిడెంట్ మృతి
నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ విమానం మార్పుపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ..