ఇరాన్ బ్రహ్మాస్త్రం.. ఖొర్రంషెహర్-4
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:38 AM
ఇజ్రాయెల్-అమెరికాలతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ తాజాగా ఖొర్రంషెహర్-4 క్షిపణులను బయటకు తీసింది. ఇవి ఇజ్రాయెల్లో పలు నగరాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించినట్లుగా వెల్లడైంది.
టెహ్రాన్, మార్చి 11: ఇజ్రాయెల్-అమెరికాలతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ తాజాగా ఖొర్రంషెహర్-4 క్షిపణులను బయటకు తీసింది. ఇవి ఇజ్రాయెల్లో పలు నగరాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించినట్లుగా వెల్లడైంది. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను నేలమట్టం చేసేందుకు కూడా ఇరాన్ ఈ క్షిపణులనే ఉపయోగిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ అత్యాధునిక ఆయుధాలపై ఆసక్తి నెలకొంది. ఖొర్రంషెహర్-4.. నాలుగో తరం క్షిపణి. దీనిని ఖైబర్ అని కూడా పిలుస్తారు. ఇది మధ్యస్థాయి బాలిస్టిక్ క్షిపణి. రెండు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. అంటే, ఇజ్రాయెల్, సౌదీఅరేబియా, యూఏఈ, ఒమన్, బహ్రెయిన్ల వరకూ వెళ్లగలదు. వాతావరణం వెలుపల ఈ క్షిపణి గరిష్ఠ వేగం మ్యాక్ 16 (గంటకు 20 వేల కి.మీ.లు). వాతావరణంలో మ్యాక్ 8 (గంటకు 8 వేల కి.మీ.లు). ఇంత వేగంతో వెళ్తుంది కాబట్టి.. దీనిని గుర్తించి తిప్పికొట్టే అవకాశం శత్రువులకు చాలా తక్కువ. దాదాపు 1500 కిలోల వార్హెడ్ను (పేలుడు పదార్థాన్ని) ఈ క్షిపణి మోసుకెళ్లగలదు.