హొర్ముజ్లో ఆ దేశాల నౌకలను అనుమతించం!
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:55 AM
అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాలతోపాటు వాటికి మద్దతు ఇచ్చే దేశాల నౌకలకు హొర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే అనుమతిని...
అయినా.. ముందుకొస్తే పేల్చివేస్తాం: ఇరాన్
టెహ్రాన్, న్యూఢిల్లీ, మార్చి 5: అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాలతోపాటు వాటికి మద్దతు ఇచ్చే దేశాల నౌకలకు హొర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే అనుమతిని ఇవ్వబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఆ దేశాల నౌకలు ముందుకొస్తే వాటిని పేల్చి వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్కు చెందిన ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ గురువారం ఒక ప్రకటన చేసింది. అంతర్జాతీయ నిబంధనలు, తీర్మానాలకు అనుగుణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, యుద్ధవేళల్లో హొర్ముజ్ జలసంధి మార్గంపై నియంత్రణ తమకే ఉంటుందని తెలిపింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన అనంతరం హొర్ముజ్ జలసంధిని మూ సేస్తున్నట్లు ఇరాన్ వర్గాలు పేర్కొన్నప్పటికీ.. అధికారికంగా ప్రకటించటం ఇదే తొలిసారి. కాగా, ఈ జాబితాలో భారత్ లేకపోవటంతో.. భారత్కువచ్చే రవాణా నౌకలకు ఇరాన్ మినహాయింపు ఇచ్చినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పశ్చిమాసియా నుంచి ముడిచమురు, సహజవాయువు తదితర ఉత్పత్తుల రవాణా నిలిచిపోయిన నేపథ్యంలో.. భారత్ అమెరికా సాయం కోరుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.