Share News

అమెరికాపై ఇరాన్‌ చావుదెబ్బ

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:31 AM

తమ దాడులతో ఇరాన్‌ పూర్తిగా ధ్వంసమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ తన సత్తా తగ్గలేదని ఇరాన్‌ మరోసారి నిరూపించింది.

అమెరికాపై ఇరాన్‌ చావుదెబ్బ

  • బహ్రెయిన్‌లోని అమెరికా నేవల్‌ బేస్‌ను ధ్వంసం చేసిన ఇరాన్‌

  • అమెరికా ఫిఫ్త్‌ ఫ్లీట్‌, నేవీ సెంట్రల్‌ కమాండ్‌కు ఇదే ప్రధాన కేంద్రం

  • జోర్డాన్‌లో ఒక ఏ-10 థండర్‌బోల్ట్‌, 8 ఎఫ్‌-15 యుద్ధ విమానాలూ ధ్వంసం

వాషింగ్టన్‌/టెహ్రాన్‌, సెప్టెంబరు 11: తమ దాడులతో ఇరాన్‌ పూర్తిగా ధ్వంసమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ తన సత్తా తగ్గలేదని ఇరాన్‌ మరోసారి నిరూపించింది. పశ్చిమాసియాలో అమెరికా మిలిటరీకి అత్యంత కీలకమైన స్థావరాలను తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా అమెరికా నేవీ సెంట్రల్‌ కమాండ్‌కు, ఫిఫ్త్‌ ఫ్లీట్‌కు ప్రధాన కార్యాలయంగా ఉన్న బహ్రెయిన్‌లోని నేవల్‌ సపోర్ట్‌ యాక్టివిటీ (ఎన్‌ఎస్ఏ- బహ్రెయిన్‌)ను ఇటీవల ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని అమెరికా నేవీ తాత్కాలిక కార్యదర్శి హంగ్‌ కావోనే స్వయంగా చెప్పటం గమనార్హం. ఇటీవల ఇరాన్‌ చేసిన క్షిపణి దాడులతో ఎన్‌ఎస్ఏ బహ్రెయిన్‌ దాదాపు పూర్తిగా ధ్వంసమైందని, అందులోని సిబ్బందిని ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ఎపోక్‌ టైమ్స్‌ వార్తా సంస్థకు కావో తెలిపారు. దానిని పునరుద్ధరించే అవకాశం ఉందా లేదా? అనే అంశాన్ని తమ నిపుణుల బృందం పరిశీలిస్తోందని చెప్పారు. ఇప్పట్లో ఇక్కడ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నేవీ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో అమెరికా నేవీకి ఎన్‌ఎ్‌సఏ -బహ్రెయిన్‌ చాలా ఏళ్లుగా ప్రధాన స్థావరంగా ఉంది.


యుద్ధ విమానాలూ ధ్వంసం

ఇరాన్‌ దాడుల్లో జోర్డాన్‌లోని అమెరికా యుద్ధ విమానాలు కూడా దెబ్బతిన్నాయి. గత మంగళవారం రాత్రి ఇరాన్‌ జరిపిన దాడిలో మువాఫక్‌ సాల్తీ ఎయిర్‌ బేస్‌లో నిలిపి ఉంచిన ఒక ఏ-10 థండర్‌ బోల్ట్‌-2తోపాటు 8 ఎఫ్‌-15 యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయని అమెరికా అధికారులను ఉటంకిస్తూ రాయిట ర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. ఏ-10 విమానానికి చెందిన ఒక రెక్క పూర్తిగా తెగిపోయిందని, ఎఫ్‌-15 విమానాలు మాత్రం స్వల్పంగానే దెబ్బతిన్నాయని ఆ అధికారులు వెల్లడించారు. ఇరాన్‌ క్షిపణులను అడ్డుకొనేందుకు అమెరికా అత్యంత ఖరీదైన 30 పేట్రియాట్‌ ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులను వినియోగించాల్సి వచ్చిందని రాయిటర్స్‌ పేర్కొంది. కాగా, అమెరికా కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ మే నెల రిపోర్టులో ఇరాన్‌తో యుద్ధంలో 42 యుద్ధ విమానాలు కోల్పోయినట్లు తెలిపింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధంలో 18 మంది అమెరికా సైనికులు చనిపోగా, 800 మంది వరకు గాయపడ్డారని రిపోర్టులు వెలువడ్డాయి. యుద్ధంలో తమకు జరిగిన నష్టంపై అమెరికా బహిరంగంగా ప్రకటన చేయటంపై ఇరాన్‌ సెటైర్లు వేసింది. నష్టం గురించి ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు సంతోషం అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ శుక్రవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇరాన్‌ మిలిటరీ అమెరికాకు తన సత్తాను చూపించిందని కొనియాడారు. హోర్ముజ్‌ జలసంధిలో అమెరికాకు చెందిన మానవరహిత పడవను గురువారం ధ్వంసం చేసినట్లు ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ ప్రకటించింది. మరోవైపు ఇరాన్‌పై ట్రంప్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇరాన్‌ కుప్పకూలటానికి సిద్ధంగా ఉందంటూనే.. అమెరికాలో మిడ్‌ ఎన్నికల వరకు యుద్ధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను అణ్వాయుధాన్ని సమకూర్చుకొనేందుకు అనుమతి ఇచ్చే బలహీనులు అమెరికా ఎన్నికల్లో గెలవాలని ఇరాన్‌ కోరుకుంటోందని ట్రూత్‌ సోషల్‌లో మండిపడ్డారు.

Updated Date - Sep 12 , 2026 | 06:57 AM