Share News

భారత్‌కు ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ సెప్టెంబరులో రాక..

ABN , Publish Date - Aug 15 , 2026 | 05:19 AM

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ సెప్టెంబరులో భారత్‌కు రానున్నారు. న్యూఢిల్లీ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరుకానున్నారు.

భారత్‌కు ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ సెప్టెంబరులో రాక..

  • ఢిల్లీలో జరిగే బ్రిక్స్‌ సదస్సుకు హాజరు

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ సెప్టెంబరులో భారత్‌కు రానున్నారు. న్యూఢిల్లీ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అమెరికా- ఇరాన్‌ సంక్షోభం కొనసాగుతున్న వేళ ఆ దేశ అగ్రనేత భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు కూడా బ్రిక్స్‌ సదస్సులో పాల్గొననున్నారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో జరిగిన బ్రిక్స్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అర్గాగ్చీ ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో.. పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత కీలకపాత్ర పోషించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బిల్డింగ్‌ ఫర్‌ రెసిలియన్స్‌, ఇన్నోవేషన్‌, కోఆపరేషన్‌ అండ్‌ సస్టైనబిలిటీ’ అనే అజెండాతో సాగనున్న ఈ 18వ శిఖరాగ్ర సమావేశానికి భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. 2024లో ఇరాన్‌ బ్రిక్స్‌ కూటమిలో సభ్యత్వం పొందగా.. ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 11కి చేరింది.

Updated Date - Aug 15 , 2026 | 05:21 AM