Supreme Leader Khamenei: అట్టుడుకుతున్న ఇరాన్!
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:27 AM
ఇరాన్లో కల్లోలం మొదలైంది. కరెన్సీ విలువ పడిపోవడం, ధరల పెరుగుదలపై మొదలైన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఆయతొల్లా ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలంటూ....
మరింత ఉధృతమైన ఆందోళనలు.. సుప్రీం లీడర్ ఖమేనీ తప్పుకోవాలని డిమాండ్లు
దుబాయ్, జనవరి 9: ఇరాన్లో కల్లోలం మొదలైంది. కరెన్సీ విలువ పడిపోవడం, ధరల పెరుగుదలపై మొదలైన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఆయతొల్లా ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నా యి. మూకుమ్మడిగా ఆందోళనలు చేపట్టాలని ప్రవాసంలో ఉన్న ఇరాన్ యువరాజు రెజా పహ్లావీ పిలుపునివ్వడంతో.. గురువారం రాత్రి పెద్దసంఖ్యలో యువత ఆందోళనలకు దిగారు. వారికి మద్దతుగా మహిళలు, పెద్దవయసువారు ఇళ్లపై నుంచి ని నాదాలు చేశారు. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఆందోళనలు విస్తరించాయి. నిరసనలకు మద్దతుగా చాలా ప్రాంతాల్లో మార్కెట్లను, వాణిజ్య సంస్థలను మూసివేశారు. రోడ్లపై వాహనాలకు, ప్రభు త్వ కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. విగ్రహాలను ధ్వంసం చేశా రు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడికి ప్ర యత్నించారు. ఈ ఆందోళనలను అత్యంత కఠినంగా అణచివేసేందుకు ఇరాన్ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ను నిలిపివేసింది. విదేశాలకు చేసే, విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ను నిషేధించింది. విమానాల రాకపోకలను నిలిపివేసింది. దీనితో ఇరాన్ ప్రజలకు బయటి ప్రపంచంతో దాదాపుగా సంబంధాలు తెగిపోయాయి. ఇక కీలక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలను ఖమేనీ ప్రభుత్వం మోహరించింది. అయినా కూడా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. పలుచోట్ల ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జిలు, బాష్పవాయుగోళాల ప్రయోగానికి దిగుతున్నారు. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 41 మంది మృతిచెందారు. వేలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది: ట్రంప్
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై ఇరాన్ పాలకులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. ఒకవేళ వారు ఆందోళకారులను చంపడం వంటివి మొదలుపెడితే తాము తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అవసరమైతే తాను అంతర్జాతీయ చట్టాలను పట్టించుకోబోనని వ్యాఖ్యానించారు. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసిన అనంతరం ఆ దేశంలో రాజకీయ ఖైదీల విడుదల ప్రారంభమైందని.. తాను చేసిన పని సరైనదేనని దీనితో రుజువైందని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ యువత ఆందోళనలను మరింత ముమ్మరం చేయాలని యువరాజు రెజా పహ్లావీ (ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్ను పాలించిన రాజు షా పహ్లావీ కుమారుడు) పిలుపునిచ్చారు ప్రపంచమంతా ఇప్పుడు ఇరాన్వైపు చూస్తోందని, మీ డిమాండ్లేమిటో వినిపించాలని పేర్కొన్నారు.
ఇరానీయుల రక్తంతో తడిసిన చేతులవి: ఖమేనీ
ఇరాన్లో ఆందోళనకారులను ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీ తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను సంతోషపెట్టడానికి కొందరు ఇరానీయులు తమ సొంత దేశంలో వీధుల్లో పరుగెడుతున్నారని వ్యాఖ్యానించారు. గురువారం రాత్రి కొందరు టెహ్రాన్లో విధ్వంసానికి దిగారని.. విదేశీ శక్తుల చేతుల్లో కిరా యి సైనికుల్లా వ్యవహరిస్తున్న అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఆందోళనకారులను చంపితే తీవ్రంగా స్పందిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏకపక్షంగా దాడులకు దిగిన ట్రంప్ చేతు లు ఇరానీయుల రక్తంతో తడిశాయని వ్యా ఖ్యానించారు. ఇతరుల అంశాల్లో జోక్యం చేసుకునే బదులు తమ సొంత దేశంపై దృష్టిపెట్టుకోవాలని హితవు పలికారు. ఇరాన్ యువత ఏకతాటిపై ఉండాలని, దేశం ఐకమత్యంగా ఉన్నప్పుడే శత్రువులను ఎదుర్కొనగలమని పేర్కొన్నారు. ఈ మేరకు టెహ్రాన్లోని తన భవనం బయట ప్రజలను ఉద్దేశించి ఖమేనీ ప్రసంగిస్తున్న వీడియోను ఇరాన్ అధికారిక టెలివిజన్ ప్రసారం చేసింది.