భారత యుద్ధనౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక
ABN , Publish Date - Sep 17 , 2026 | 06:42 AM
పాకిస్థాన్ నౌకాదళ విన్యాసాల వేళ.. సమీపంలోని భారత యుద్ధనౌకను పాక్ నేవీకి చెందిన ఓ నౌక ఢీకొనటం తీవ్ర వివాదం రేపింది.
అరేబియా సముద్రంలో ఘటన
పాక్ దౌత్యాధికారికి సమన్లు, తీవ్ర నిరసన
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: పాకిస్థాన్ నౌకాదళ విన్యాసాల వేళ.. సమీపంలోని భారత యుద్ధనౌకను పాక్ నేవీకి చెందిన ఓ నౌక ఢీకొనటం తీవ్ర వివాదం రేపింది. ఈ ఘటనపై బుధవారం భారత విదేశాంగశాఖ ఢిల్లీలోని పాకిస్థాన్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసి, గట్టి నిరసన వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలో రోజువారీ నిఘా విధుల్లో ఉన్న భారత యుద్ధనౌకను వేగంగా వచ్చిన పాక్ నౌక హునైన్ ఢీకొట్టిందని, ఈ ఘటనలో భారత నౌకకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని, హునైన్ మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ నౌకాదళ విన్యాసాలు జరుగుతున్న సమయంలో ఇది జరిగిందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ దౌత్యాధికారిని పిలిపించిన విదేశాంగశాఖ.. పాక్ నౌకాదళం అన్ప్రొఫెషనల్గా వ్యవహరించిందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాల మేరకు పాక్ సైనికదళాలు జాగ్రత్తగా నడుచుకోవాలని, ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పాక్ ప్రభుత్వానికి చెప్పాలని ఆ దౌత్యాధికారికి సూచించింది. మరోవైపు, జరిగిన ఘటన పట్ల పాకిస్థాన్ విదేశాంగశాఖకు నిరసన తెలియజేయాలని ఇస్లామాబాద్లో ఉన్న భారత రాయబారిని ఆదేశించినట్లు విదేశాంగశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.