గూగుల్ ఏఐ విభాగం నుంచి సీనియర్ పరిశోధకుడు జోష్ ఎంగెల్స్ బయటకు
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:02 AM
ఏఐ వల్ల భవిష్యత్తులో మానవాళికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ టెక్నాలజీ రంగంలో మరో ఉన్నతాధికారి తన పదవికి రాజీనామా చేశారు.
ఏఐతో మానవాళికి ప్రమాదం ఉందని హెచ్చరిక
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: ఏఐ వల్ల భవిష్యత్తులో మానవాళికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ టెక్నాలజీ రంగంలో మరో ఉన్నతాధికారి తన పదవికి రాజీనామా చేశారు. గూగుల్ డీప్మైండ్లోని ‘ఏఐజీ సేఫ్టీ’ విభాగంలోని సీనియర్ పరిశోధకుడు జోష్ ఎంగెల్స్ ఏఐ పరిశోధనల నుంచి తప్పుకున్నారు. ఏఐ ప్రస్తుతం ఉన్న భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ వేగంగా అభివృద్ధి చెందుతోందని, రాబోయే ఐదేళ్లలో ఏఐ మోడల్స్ మానవాళికి తీవ్ర హాని చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏఐ మోడల్స్ తమను తాము అభివృద్ధి చేసుకునే స్థాయికి చేరుకుంటున్నాయని, ఈ క్రమంలో అవి మానవ నియంత్రణను కోల్పోతే పరిణామాలు వినాశకరంగా మారుతాయని అన్నారు. అందుకే ఏఐ మీద పరిశోధనలు చేయకూడదన్న ఉద్దేశంతోనే తాను గూగుల్ నుంచి బయటకు వెళ్తున్నానని, ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా తిరస్కరించానని చెప్పారు. ఏఐ మీద జరుగుతున్న పరిశోధనల వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఎంగెల్స్ ఎంఈటీఆర్ అనే స్వచ్ఛంద పరిశోధనా సంస్థలో చేరి ఏఐని కట్టడి చేసే ప్రాజెక్టులపై పనిచేయనున్నారు.