దలైలామాకు ‘గ్రామీ’ పురస్కారం.. మండిపడ్డ చైనా
ABN , Publish Date - Feb 03 , 2026 | 02:31 AM
టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. తన 90వ ఏట.. సంగీత ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే ప్రతిష్ఠాత్మక...
వేర్పాటువాదానికి వేదికగా మార్చొద్దంటూ హెచ్చరిక
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. తన 90వ ఏట.. సంగీత ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డును కైవసం చేసుకున్నారు. ‘మెడిటేషన్’ అనే ఆల్బమ్కు గాను ‘బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్’ విభాగంలో ఆయనను ఈ అవార్డు వరించింది. కాలిఫోర్నియా వేదికగా ఆదివారం జరిగిన 68వ గ్రామీ అవార్డుల వేడుకల్లో ఈ ప్రకటన వెలువడింది. హిందుస్థానీ సంగీతం మేళవింపుతో కరుణ, మానసిక ప్రశాంతతపై ఆయన అందించిన సందేశాల సమాహారంగా ఈ ఆడియో రూపొందింది. ఈ అవార్డు తన వ్యక్తిగత విజయం కాదంటూ దలైలామా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, ప్రేమ, మానవతా సందేశాలను మరింత విస్తరింపజేసే అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. అయితే, దలైలామాకు ఈ గౌరవం దక్కడంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సోమవారం ఆ దేశ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. గ్రామీ వంటి అంతర్జాతీయ వేదికలను ఓ వేర్పాటువాదిని కీర్తించడానికి ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడింది.